మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాకు బలి..అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

శనివారం, 1 ఆగస్టు 2020 (17:20 IST)
మాజీ మంత్రి, బిజెపి సీనియర్‌ నేత పైడికొండల మాణిక్యాలరావు (60) కరోనాతో మృతిచెందారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు.

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బిజెపి తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రివి దక్కించుకున్నారు.

ఫొటో గ్రాఫర్‌గా కేరీర్‌ ప్రారంభించిన మాణిక్యాలరావు 2014 నుంచి 2018 వరకు మంత్రిగా కొనసాగారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు: ముఖ్యమంత్రి ఆదేశం
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. మాజీ మంత్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు.
 
జీవీఎల్ నరసింహారావు సంతాపం
మా సీనియర్ పార్టీ నాయకులు, మాజీ రాష్ట్ర మంత్రి, స్నేహ శీలి, ఆప్త మిత్రులు మాణిక్యలరావు ట్రీట్మెంట్ పొందుతూ అకాల మరణం చెందారు. ఇది మా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు అత్యంత బాధాకర పరిణామం.
 
మాణిక్యలరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. వారి మరణం బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు తీరని లోటుగా చిరకాలం మిగిలిపోతుంది.

చంద్రబాబు దిగ్భ్రాంతి
మాజీ మంత్రి మాణిక్యాలరావు అకాల మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  20రోజులుగా చికిత్స పొందుతున్న మాణిక్యాలరావును కాపాడుకోలేక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 
 
‘‘దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో దేవాలయాల అభివృద్దికి, అర్చకుల సంక్షేమానికి పాటుబడ్డారు. శాసన సభ్యునిగా తాడేపల్లి గూడెం అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం కట్టుబడి పని చేశారని’’ చంద్రబాబు కొనియాడారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు