ఫైబర్ నెట్ కేసు : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు

శుక్రవారం, 20 అక్టోబరు 2023 (08:55 IST)
ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించనుంది. దీంతో టీడీపీ నేతలు, శ్రేణులతో పాటు.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
ఈ పిటిషన్‌ను గతంలో ఏపీ హైకోర్టు ఈ నెల 9వ తేదీన కొట్టివేసింది. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 13న విచారణకు వచ్చినప్పుడు ఆయనకు 18వ తేదీ వరకు ఉపశమనం కల్పించింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆయనను 16వ తేదీన హాజరుపరచాలని ఏసీబీ ప్రత్యేకకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అరెస్టు చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. 
 
అయితే ఈ కేసుకూ 17ఏ నిబంధన వర్తిస్తుందని ఆయన వాదించినందున స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ పూర్తయిన తర్వాత దీనిపై విచారిస్తామని చెప్పి న్యాయమూర్తులు.. ఆ కేసును 17వ తేదీకి వాయిదా వేశారు. అదేసమయంలో చంద్రబాబును అరెస్టు చేయకుండా నిలువరించాలని ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. మంగళవారం ఈ కేసుపై విచారించడానికి సమయం లేకపోవడంతో ధర్మాసనం దాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటివరకూ అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం జరిగే విచారణ ప్రాధాన్యం సంతరించుకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు