మిస్టర్ జగన్.. నిన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. జనసేనాని హెచ్చరిక

వరుణ్

బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (21:56 IST)
తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన బహిరంగ సభలో వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేనాన్ని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆవేశంతో ఊగిపోయారు. మిస్టర్ జగన్... సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. జగన్... నీ కోటలు బద్దలు కొడతాం అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. నిన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ హెచ్చరించారు. వామనుడు అడిగిన ఒకే ఒక్క అడుగుకు.. బలిచక్రవర్తి కూడా ఒక్క అడుగే కాదా అని తీసిపారేశాడు. ఆ తర్వాత తెలిసింది.. ఒక్క అడుగే ఎంత పెద్దదో అని అన్నారు. 
 
తాము 24 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు ఒప్పుకోవడం పట్ల వైసీపీ నేతలు, వైకాపా మద్దతుదారులు విమర్శిస్తున్నారని... కానీ వామనుడ్ని చూసి బలిచక్రవర్తి కూడా ఇంతేనా అనుకున్నాడని, ఆ తర్వాత నెత్తిమీద కాలుబెట్టి తొక్కేసరికి అది 'ఎంతో' అని అప్పుడు అర్థమైందని అన్నారు. వామనుడిలాగా నిన్ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు, నా పార్టీ  పేరు జనసేన కాదు... అంటూ సవాల్ విసిరారు. 
 
'మనం ఏమిటో  వైసీపీ వాళ్లకు ఎన్నికల తర్వాత అర్థమవుతుంది... నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా... అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్... జనసేన ఒక్క సీటు గెలిస్తేనే... నేను రాజమండ్రికి వస్తుంటే రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. 10వ తరగతి పిల్లలు రాత్రంతా చదువుకుని పరీక్షకు సిద్ధమైనట్టు మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. ఇప్పటిదాకా పవన్ కల్యాణ్ తాలూకు శాంతినే చూశావు... ఇక నా యుద్ధం ఏంటో చూస్తావు' అంటూ హెచ్చరించారు.
 
నన్ను నమ్మే వాడే నా వాడు అవుతాడు, నన్ను అనుమానించేవాడు నా వాడు ఎప్పటికీ కాడు. పవన్ కల్యాణ్ తో స్నేహం అంటే చచ్చేదాకా... పవన్ కల్యాణ్ తో శత్రుత్వం అంటే అవతలివాడు చచ్చేదాకా. పవన్ కల్యాణ్ అంటే... అర్ధరాత్రి వచ్చే 108, మహిళలు రక్షణ కోసం కట్టే రక్షాబంధన్, పెద్దలు గౌరవంగా భుజాన వేసుకునే కండువా... అంటూ పవన్ ఆవేశంగా ప్రసంగించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు