టీడీపీ బీసీ నేతలంతా చంద్రబాబును నిలదీయాలి: బొత్స

మంగళవారం, 3 మార్చి 2020 (07:05 IST)
స్థానిక ఎన్నికల్లో బలహీన వర్గాలకు న్యాయం జరగకుండా టీడీపీ అడ్డుకుందని, టీడీపీలోని బీసీ నేతలంతా చంద్రబాబును నిలదీయాలని మంత్రి బొత్స పేర్కొన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో 59 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్​లో నిర్ణయించామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ న్యాయం జరగాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్తామన్నారు.

అత్యధిక శాతం ఉన్న బలహీన వర్గాలకు న్యాయం చేయలేకపోతున్నామనే బాధ తమలో ఉందని బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనతోనే ఇలా జరిగిందని ఆరోపించారు. రిజర్వేషన్లను అడ్డుకున్న చంద్రబాబును బడుగు బలహీన వర్గాల వారెవరూ క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీకీ చెందిన వ్యక్తే కోర్టుకు వెళ్లారు 59 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ టీడీపీకు చెందిన ప్రతాపరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించిందన్న బొత్స.. స్థానిక ఎన్నికల్లో బలహీన వర్గాలకు న్యాయం జరగకుండా టీడీపీ అడ్డుకుందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా చేసి.. రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా చేయాలని టీడీపీ అనుకుంటోందని బొత్స విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు