హనుమంతుని జన్మస్థానంగా తిరుమల క్షేత్రం.. ఉగాది రోజున..?

శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (11:39 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రం ఇకపై హనుమంతుని జన్మస్థానంగానూ గుర్తింపు పొందనుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ మేరకు టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
 
కమిటీలోని పండితులు జ్యోతిష శాస్త్రం, శాసనాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాలతో ఉగాది రోజున ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హనుమంతుని జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇతర వివరాలతో త్వరలో సమగ్రమైన పుస్తకాన్ని తీసుకుని రానున్నట్లు పేర్కొన్నారు.
 
బరామాయణంలో ప్రముఖ పాత్ర హనుమంతుడు.. ఆయన అంజనాద్రి కొండలో జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో నిరూపించేందుకు 2020 డిసెంబరులో టీటీడీ పండితులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలోని పండితులు పలుమార్లు సమావేశాలు నిర్వహించి లోతుగా పరిశోధన చేసి హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించారు.
 
శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్యం గ్రంథం, వరాహమిహిరుని బృహత్సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వేంకటేశ్వరస్వామివారి చెంత గల అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని యుగం ప్రకారం, తేదీ ప్రకారం నిర్ధారించారు. దీంతో ఇక నుంచి తిరుమల క్షేత్రం.. కేసరినందన రామభక్త హనుమాన్ జన్మస్థానంగా కూడా ఖ్యాతిగాంచనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు