వైకాపా హత్యారాజకీయాలు విడనాడాలి: సోము వీర్రాజు

బుధవారం, 30 డిశెంబరు 2020 (20:06 IST)
ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు, హత్యలతో వైకాపా ప్రభుత్వం సమాధానం చెబుతుందని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. వైకాపా నాయకులు ఇసుకమాఫియా, ఇళ్ల స్థలాల కుంభకోణాలకు పాల్పడుతుంటే వాటిని బయటపెట్టడం, ప్రశ్నించడం ప్రతిపక్షాల విధిగా పేర్కొన్నారు.

తప్పును బయటపెడితే సరిదద్దుకోవాల్సిందిపోయి హత్యలకు పాల్పడటం కిరాతక చర్యగా పేర్కొన్నారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ కార్యకర్తను నిర్దాక్షిణంగా నరికి చంపడం అత్యంత హేయమైన చర్యగా  అభివర్ణించారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసు వ్యవస్థ దారుణంగా విఫలైమైందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అడుగంటాయని విమర్శించారు. పోలీసులు అధికారపార్టీకి దాసులుగా మారడం, నేరస్తులపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి చర్యలు కొనసాగుతున్నాయని ఆక్షేపించారు. తక్షణం హంతకులను కఠినంగా శిక్షంచాలని డిమాండ్‌ చేశారు. 
 
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్దం కొండపై శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. కొండబిట్రగుంట, పిఠాపురం, అంతర్వేదిలో హిందూ ఆలయాల ధ్వంసం కేసుల్లో నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆవేదన చెందారు.

వైకాపా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం కారణంగానే హిందూ ధర్మంపై దాడులు, విధ్వంసాలు కొనసాగుతున్నాయని భావించాల్సి వస్తోందన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా హిందూ ధర్మంపై దాడులు ఆపకుంటే హిందువుల ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సివస్తోందని హెచ్చరించారు.
 
జిఓ 77 రద్దు చేయాల్సిందే
"పేద, బలహీన తరగతులకు శాపంగా మారిన జీఓ నెంబరు 77 తక్షణం రద్దుచేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు జీఓ నెంబరు 77 జారీ చేయడం ద్వారా 2020-21 నుంచి విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను మీ ప్రభత్వుం రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది.  యూనివర్శిటీలు, ప్రభుత్వ పీజీ కాలేజీల విద్యార్థులకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని తెలిపింది. 

విద్యార్థులు చదివేందుకు అవసరమైనన్ని ప్రభుత్వ పిజి కళాశాలలు వేళ్లమీద లెక్కపెట్టినట్లుగా మాత్రమే ఉన్నాయని మీకు తెలీదా? ప్రభుత్వ కళాశాలల్లో సీటు దొరకని విద్యార్థులు ప్రైవేట్‌ కళాశాలల్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు  ప్రైవేట్‌ కళాశాలల్లో చదివితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని చెప్పడం దుర్మార్గం. రాష్ట్రవ్యాప్తంగా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పద్దతిలో 158 ప్రైవేట్‌ కాలేజీలు నడుస్తున్నాయి. వీటిలో 70 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.

2018-19 వరకు ఏఎఫ్‌ఆర్‌సీ(ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిషన్‌) నిర్ణయించిన ప్రకారం... ఎంటెక్‌కు రూ.57 వేలు, ఎంఫార్మసీ రూ.1.10 లక్షలు, ఫార్మాడీ(పోస్టు బ్యాచిలర్‌) రూ.68 వేలు, ఎంబీఏ, ఎంసీఏలకు రూ.27 వేలు బోధనరుసుము ఉంది. కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వమే బోధనా రుసుములుచెల్లించేది. ఈ ఉన్నత చదువుతో రాష్ట్రంలో కాకున్నా ఎక్కడైనా వారు ఉద్యోగం సంపాదించగలుగుతారు.

కాని మీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వీరందరూ నష్టపోతారు. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగంలో మార్పులు తెస్తామన్నారు. అదేనా ఈ మార్పు. ఉన్నత విద్య చదివే విద్యార్థులకు మీ అసమర్దపాలన గురించి తెలిస్తుందని, వారు మీకు ఓటేయరని భావించి ఇలా కుట్ర చేసి వారికి చదువును దూరం చేస్తున్నారా?  పేద విద్యార్థులు ఇంత ఫీజును ఎలా చెల్లించగలరు.

రీయింబర్స్‌మెంట్‌ నిలిపివేయడం వల్ల వీరు ఉన్నత విద్యకు దూరమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి విద్యా వ్యతిరేక విధానాలను భాజపా తిప్పికొడుతుంది. ఈ జిఓను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తాం.  జగనన్న వసతి, విద్యా దీవెన పథకాలు అందరికీ వర్తింపజేయాలి. 2018-19కి సంబంధించి 6 నెలలు, గతేడాది బకాయిలు కలిపి మొత్తం రూ.550 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని చెల్లించాలి. 
 
విదేశీ విద్యాదీవెన పథకాన్ని వర్తింపచేయాలి
అలాగే విదేశాల్లో చదివే విద్యార్థులకు ఆర్ధికసహాయం అందిస్తోన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని కూడా మీరు నిలిపివేశారు. ఈ పథకం ద్వారా పలువురు విద్యార్థులు విదేశాల్లోని పలు ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు తెచ్చుకుని అక్కడికెళ్లి కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాల్లో స్దిరపడుతున్నారు. గత ప్రభుత్వం ఇలా విదేశాల్లో చదివేవారికి రూ.10లక్షల ఆర్ధికసహాయం చేస్తే మీరు రూ.15 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు.

మీ మాటలు విని ఆర్దికసహాయం వస్తుంది కదా అని ఎంతో మంది విద్యార్థులు అప్పులుచేసి విదేశాల్లో సీటు తెచ్చుకుని చదువుతున్నారు. కాని వారికి ఇంత వరకు మీరు నిధులు విడుదలచేయలేదు. తల్లిదండ్రలు అప్పులు చెల్లించలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు. అందువల్ల విదేశీ విద్యాదీవెన పథకాన్ని కూడా వెంటనే ప్రారంభించాలి" అని డిమాండ్‌ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు