గుడివాడ అమర్నాథ్‌కు హ్యాండిచ్చిన ఏపీ సీఎం జగన్... సీటు మరొకరికి కేటాయింపు...

వరుణ్

గురువారం, 22 ఫిబ్రవరి 2024 (14:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్‌కు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేరుకోలేని షాకిచ్చారు. ఈ నెల 22న రానున్న ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు ప్రభుత్వం తరపున స్వాగతం పలికే బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. మంత్రిగా అమర్నాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖకు ప్రముఖులు వచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికే బాధ్యతను ఆయనకు అప్పగించారు. 
 
ఈసారి ఆ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి బూడి ముత్యాలనాయుడుకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వైకాపా అధిష్టానం అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గ బాధ్యునిగా మరొకరిని నియమించింది. ఇంతవరకు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసేది కూడా తేల్చలేదు. ఇప్పుడు ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యత నుంచి తప్పించడం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
 
మీ అక్కను తీసుకురా.. లేకపోతే నువ్వు రా.. ప్రభుత్వం మాది.. ఏం చేయలేవు : వాలంటీర్ బెదిరింపులు
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లు మరింతగా బరితెగిస్తున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలు, అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా నరసరావుపేటలో ఓ బాలికను వాలంటీరు వేధించాడు.. మీ అక్కను తీసుకురా.. లేకపోతే నువ్వు రా.. మాదే ప్రభుత్వం. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని ఓ వాలంటీరు బాలికను వేధించాడు. రోజురోజుకు వేధింపులు తీవ్రమవడంతో ఆ బాలిక(13) ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పల్నాడు జిల్లా నరసరావుపేట మండల పరిధిలోని ఓ గ్రామంలో పిట్టు శ్రీకాంత్ రెడ్డి(25) వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ విద్యార్థినికి పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో ఇడుపులపాయ ట్రిపుల్ఎస్ఐటీలో సీటు వచ్చింది. ఆమె రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో విద్యాదీవెన, తదితర పథకాల కోసం ఓటీపీ చెప్పాలని వాలంటీరు.. విద్యార్థిని ఫోన్ నంబరు తీసుకున్నాడు. అప్పటి నుంచి ప్రేమించాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. 
 
నంబరు బ్లాక్ చేసినా వేర్వేరు నంబర్లతో ఫోన్ చేసేవాడు. అంతటితో ఆగకుండా ఆమె చెల్లెలు వెంటపడ్డాడు. మీ అక్కను తీసుకురా, లేకపోతే నవ్వు రా అంటూ వేధించాడు. ప్రభుత్వం మాదే.. మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు అని హెచ్చరించాడు. ఈ విషయం తెలిసిన బాలిక కుటుంబసభ్యులు వాలంటీరు ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పారు. అయినా సరే మంగళవారం మళ్లీ బాలిక వెంట పడగా ఆమె ఎలుకల మందు తాగింది. అలాగే పాఠశాలకు వెళ్లి వాంతులు చేసుకోవడంతో ఉపాధ్యాయులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 
 
నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులు వాలంటీరుపై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. సదరు వాలంటీరు వైకాపాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, గ్రామంలో పెద్దలకు చెప్పినా తమనే బెదిరిస్తున్నారని బాధితురాలి మేనమామ వాపోయారు. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశామని నరసరావుపేట గ్రామీణ పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు