వైకాపాకు ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే : వైఎస్ షర్మిల

వరుణ్

శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (15:40 IST)
తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలను ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు తూర్పారబట్టారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా మాఫియా రాజ్యమేలుతుందని ఆమె ఆరోపించారు. వైకాపాకు ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టేనని ఆమె పేర్కొన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఎక్కడ చూసినా మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతోందన్నారు. 
 
'వేదవతి ప్రాజెక్టును పూర్తి చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఐదేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. 2008లో వైఎస్‌ఆర్‌ శిలాఫలకం వేస్తే.. అదే ప్రాజెక్టుకు జగన్‌ మరో శిలాఫలకం వేశారు. ఈ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం. ప్రాజెక్టు కట్టి ఉంటే 80వేల ఎకరాలకు సాగునీరు వచ్చి ఉండేది. రైతుల కోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ అన్నారు.. కట్టలేదు. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి మోసం చేశారు. రైతును వైఎస్‌ఆర్‌ రాజును చేస్తే.. వైకాపా హయాంలో రైతు అప్పుల పాలయ్యారు. మూర్ఖులకు, అహంకారులకు ఓటు వేయొద్దు. మీ ఓటు వృథా కానివ్వొద్దు.. వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం.. హోదా ఇచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. అధికారమిస్తే 2.25లక్షల ఉద్యోగాలు ఇస్తాం' అని షర్మిల హామీ ఇచ్చారు.
 
న్యాయం కోసం పోరాడుతున్నాం.. షర్మిలను గెలిపించండి : సునీత 
 
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని వారిని దోషులుగా నిలబెట్టాలని, మా తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా తెలిపారు. పైగా, కడప లోక్‌సభ బరిలో నిలిచిన వైఎస్ షర్మిలను గెలిపించాలని ఆమె కడప జిల్లా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆమె స్పందించారు. దీన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. 'న్యాయం కోసం ప్రజాతీర్పు కోరుతుంటే వైకాపా అడ్డుపడుతోంది. పులివెందులలో నేను ప్రచారం చేయకుండా కేసులు వేస్తున్నారు. వివేకా హత్య అంశంపై వైకాపా నేతలు చాలాసార్లు మాట్లాడారు. మీ ఇళ్ల వద్దకు నేను రాలేకపోతే మన్నించండి. ఎన్నికల్లో షర్మిలను గెలిపించే బాధ్యత ప్రజలదే' అని ఆమె పేర్కొన్నారు. 
 
వివేకా హత్యకేసు అంశంపై వైఎస్‌ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, పురంధేశ్వరి, పవన్‌ కల్యాణ్‌, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైఎస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కడప కోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రతివాదులు, వారి అనుచరులు, ఆయా పార్టీల అభ్యర్థులు ఈ కేసులో అవినాష్‌రెడ్డిని హంతకుడిగానూ, సీఎం జగన్‌ ఆయన్ను కాపాడుతున్నట్లుగానూ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ఇలా వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేవి, వ్యాఖ్యలు చేయరాదని కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు