కరోనా అదుపులో ఉందని కుళ్లికుళ్లి ఏడుస్తున్నారు.. విజయసాయి ఫైర్

మంగళవారం, 31 మార్చి 2020 (12:43 IST)
తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీకి మద్దతునిచ్చే మీడియాను లక్ష్యంగా చేసుకుని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని కుళ్లికుళ్లి ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటివారు మృతదేహాలను చూసి సంబరపడిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు వైకాపా కార్యకర్తలు సామాజిక దూరం పాటిస్తూ కరోనా సహాయక చర్యల్లో పాల్గొంటూ, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వపరంగా ఏవైనా లోటుపాట్లుంటే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కారించాలి. ప్రజల పట్ల మన బాధ్యతను నెరవేర్చాలని కోరారు. 
 
అంతేకాకుండా, "ఎవరు చనిపోతారా అని గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తోంది ఎల్లో మీడియా. విశాఖ జిల్లాలో వృద్ధురాలు అనారోగ్యంతో మరణిస్తే రేషన్ కోసం నిల్చుని చనిపోయిందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. కరోనా అదుపులో ఉన్నందుకు ఇప్పటికే కుళ్లికుళ్లి ఏడుస్తున్న వారు డెడ్ బాడీని చూసి సంబరపడుతున్నారు.
 
చంద్రబాబు సీఎంగా లేని ఆంధ్రను ఊహించలేక పోతున్నాడు కిరసనాయిలు. ఆయనుంటే కరోనా నియంత్రణ పేరుతో రోజుకో ఫుల్‌పేజి యాడ్ వచ్చి వ్యాపారం పచ్చగా ఉండేది. ఇప్పుడది లేకపోయేటప్పటికి జగన్ సీరియస్‌గా లేరని మూర్ఛరోగిలా కొట్టుకుంటున్నాడు. ప్రజల చావులు కోరుకుంటున్న ఉన్మాదులను ఓదార్చలేం" అని విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు