దేశంలో మళ్లీ కరోనా విజృంభణ... రోజుకు 45 వేల పైచిలుకు కేసులు

ఆదివారం, 22 నవంబరు 2020 (10:41 IST)
దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. ఫలితంగా ప్రతి రోజూ 45 వేల కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 45,209 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,95,807 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 43,493 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 501 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,33,227కి పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 85,21,617 మంది కోలుకున్నారు. 4,40,962 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో శనివారం వరకు మొత్తం 13,17,33,134  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,75,326 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
కోవాగ్జిన్ పేరిట కరోనా టీకా - ట్రయల్స్‌లో ప్రతికూలత 
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ, కోవాగ్జిన్ పేరిట కరోనా టీకాను తయారు చేసి, ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్, తన ట్రయల్స్‌లో ప్రతికూల ఘటన ఒకటి జరిగిన విషయం వాస్తవమేనని తెలిపింది. అయితే, ఈ ఘటన గురించి 24 గంటల్లోనే రిపోర్ట్ చేశామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
భారత్ బయోటెక్ తొలి దశ టీకా ట్రయల్స్‌లో జరిగిన ప్రతికూల ఘటన గురించి సంస్థ రిపోర్ట్ చేయలేదని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన భారత్ బయోటెక్, "ఆగస్టులో జరిగిన ఈ ఘటన గురించి సీడీఎస్సీఓ - డీజీసీఐకి 24 గంటల వ్యవధిలోనే రిపోర్ట్ ఇచ్చాము. 
 
అయితే ఇది వ్యాక్సిన్ కారణంగా జరుగలేదు" అని స్పష్టం చేసింది. ఈ టీకాను భారత్ బయోటెక్‌తో పాటు ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్‌లు సంయుక్తంగా తయారు చేసిన సంగతితెలిసిందే. ఈ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్‌కు ఇప్పటికే అనుమతులు లభించాయి.
 
తెలంగాణాలో 873 కేసులు 
తెలంగాణలో గత 24 గంటల్లో 873 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 1,296 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,63,526కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,50,453 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,430 కి చేరింది. 
 
తెలంగాణలో ప్రస్తుతం 11,643 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 9,345 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 71 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు