ప్రయాణికుడి తుమ్ములకు బెంబేలెత్తిన సిబ్బంది.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

గురువారం, 12 మార్చి 2020 (08:36 IST)
సాటి ప్రయాణికుడి తుమ్ములకు విమాన సిబ్బందితో పాటు అందులోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అంతే... ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన అమెరికాలోని డెన్వర్‌లో సంభవించింది. 
 
సాధారణంగా ఒక విమానం విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరిన తర్వాత విమానాలు వెనక్కు రావడం లేదా గమ్యస్థానానికి కాకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం మరో ఎయిర్ పోర్టును సంప్రదించడం వంటి వార్తలు చాలానే వినుంటాం. 
 
కానీ, ఈ విమానం మాత్రం ఓ ప్రయాణికుడికి తుమ్ములు రావడంతో ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న వేళ, ఈ ఘటన అమెరికాలో జరిగింది.
 
కొలరాడో రాష్ట్రంలోని ఈగిల్ ఎయిర్ పోర్టు నుంచి న్యూజెర్సీకి ఓ విమానం బయలుదేరగా, ఓ ప్రయాణికుడికి తుమ్ములు వచ్చాయి. అదే ప్రయాణికుడు దగ్గుతూ కూడా ఉండటంతో మిగతా ప్రయాణికులు గాబరా పడిపోయారు. 
 
దీంతో పైలట్ తనకు సమీపంలో ఉన్న డెన్వర్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారాన్ని అందించాడు. ఈ విమానం అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరగా, అధికారులు సమ్మతించారు. దీంతో ఆ విమానాన్ని డెన్వర్‌లో అత్యవసరంగా దించేశారు. 
 
అప్పటికే సమాచారాన్ని అందుకున్న వైద్యులు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రయాణికుడికి వచ్చింది అలర్జీయేనని తేల్చారు. ఏ విధమైన కొవిడ్-19 లక్షణాలు లేవని వారు చెప్పడంతో విమానం తిరిగి న్యూజెర్సీకి బయలుదేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు