తెలంగాణాలో కరోనావైరస్ కమ్యూనిటీ వ్యాప్తి లేదు: మంత్రి ఈటెల

బుధవారం, 10 జూన్ 2020 (23:28 IST)
తెలంగాణలో కరోనావైరస్ కమ్యూనిటీ వ్యాప్తి లేదు. ఐసీఎమ్మార్ సర్వేలో అతి తక్కువ మందికి పాజిటివ్. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎలా ఉందనే దానిపై ఐసీఎమ్మార్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లు జరిపిన సిరం సర్వేల్లో రాష్ట్రంలో తీసిన శ్యాంపిల్స్‌లో అతి తక్కువమందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
 
కరోనా వ్యాప్తి పరిశోధనల్లో భాగంగా తెలంగాణాలో రూరల్, అర్బన్లో ప్రత్యేకంగా ఐసీఎమ్మార్ ప్రివలెన్స్ సర్వే నిర్వహించాయి. ముందుగా మే నెల 15 నుంచి 17 వరకు రూరల్ ప్రాంతాలయిన జనగాం, కామారెడ్డి, నల్గొండలో ఒక్కో జిల్లాలో 400ల శ్యాంపిల్స్ చొప్పున మొత్తం 1200ల శ్యాంపిల్స్ సేకరిస్తే, 4 మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి అంటే చాలా తక్కువ శాతం.
 
మరోపక్క అర్బన్ ప్రాంతాల్లో జరిగిన సర్వేలో భాగంగా హైదరాబాద్ లోని 5 కంటైన్మెంట్ జోన్లలో అధిబట్ల, టప్పచపుత్ర, మియపూర్, చందనగర్ , బాలాపూర్ లలో 30, 31 తేదీల్లో సిరం సర్వే నిర్వహించి ఒక్కో జోన్లో 100 శ్యాంపిల్స్ చొప్పున మొత్తం 500 ల శ్యాంపిల్స్ సేకరించారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన సిరం సర్వేలో 15 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది.
 
లాక్ డౌన్ విజయవంతంగా అమలు చేయడం వల్లనే కరోనా కట్టడి సాధ్యం అయ్యింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారు సమర్థవంతంగా అమలు చేయడం, వైద్య ఆరోగ్య శాఖతో పాటు మిగిలిన శాఖలన్ని సమన్వయంతో పని చేయడంతో పాటు ప్రజల సహకారం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు