సెప్టెంబర్‌లోనే కోవిడ్ కేసులు ఎక్కువ.. 41.5% కేసులు.. 63 లక్షల మందికి కరోనా

గురువారం, 1 అక్టోబరు 2020 (15:40 IST)
దేశ వ్యాప్తంగా కోవిడ్ సెప్టెంబరులో అత్యధికంగా నమోదైనట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కొవిడ్-19 పాజిటివ్ కేసుల్లో 41.53 శాతం కేసులు ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే నమోదైనట్టు ఓ అధ్యయనంలో వెలుగుచూసింది.

ఇప్పటివరకు దాదాపు 63 లక్షల మందికి పైగా కరోనా వైరస్ సోకినట్టు గుర్తించగా.. ఇందులో 26,21,418 మంది గత నెల రోజుల్లోనే ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. భారత్‌లో ఆగస్టు 7 నాటికి కరోనా పాజిటివ్ కేసులు 20 లక్షల మార్కు దాటగా... ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలకు చేరుకున్నాయి. 
 
మరోవైపు ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 98,678 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇందులో 33,390 మంది అంటే 33.84 శాతం మంది గడచిన నెలరోజుల్లో మృత్యువాత పడ్డారు. ఇక కరోనా బారి నుంచి బయటపడిన వారి సంఖ్య కూడా దాదాపు ఇదే మాదిరిగా ఉంది. ఇప్పటి వరకు 52,73,201 మంది కరోనా విష కౌగిలి నుంచి బయటపడగా.. కేవలం గత నెలలోనే 24,33,319 మంది అంటే 46.15 శాతం మంది కోలుకున్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 గణాంకాలపై జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ (జేహెచ్‌యూ) చేస్తున్న అధ్యయనం ప్రకారం.. అత్యధిక రికవరీలు నమోదవుతున్న దేశాల్లో భారత్ నెంబర్ 1 స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి.

కాగా అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్ మూడోస్థానంలో ఉన్నట్టు జేహెచ్‌యూ అధ్యయనం వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు