ఐపీఎల్ 2024 : రాణించిన విరోట్ కోహ్లీ... పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ బోణీ

వరుణ్

మంగళవారం, 26 మార్చి 2024 (07:38 IST)
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 77 పరుగులతో రాణించాడు. అలాగే, మ్యాచ్ ఆఖరులో దినేశ్ కార్తీక్, లోమ్రోర్‌లు అద్భుత బ్యాటింగ్‌తో ఆర్సీబీ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆ జట్టులో ధవన్ 45, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 25, జితేష్ 27 పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్‌లు తలా రెండు వికెట్లు చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ 10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులుచేసి నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 77 పరుగులు చేశాడు. దీంతో మరో నాలుగు బంతులు మిగిలవుండగానే ఆర్సీబీ జట్టు విజయభేరీ మోగించింది. 
 
కోహ్లీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. ఒక ఎండ్‌లో మిగిలిన ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ కోహ్లీ మాత్రం క్రీజ్‌లో పాతుకునిపోయి విలువైన పరుగులు చేశాడు. మంచి దూకుడు మీద కనిపించిన విరాట్.. పంజాబ్ బౌలర్ కర్రాన్ వేసిన మొదటి ఓవర్‌లోనే నాలుగు బౌండరీలు బాదాడు. పవర్ ప్లే తర్వాత కూడా పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. విరాట్ ఔట్ అయ్యాక లక్ష్య ఛేదనలో చివరి 24 బంతుల్లో 47 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో ఫినిషర్ కార్తీక్, ఇంపాక్ట్ ప్లేయర్ లోమ్రోర్‌లు అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. సామ్ కుర్రాన్, అర్ష్‌దీప్, హర్షల్ పటేల్ ఓవర్లలో భారీ షాట్లు బాదారు. మొత్తంగా గెలుపు సమీకరణం చివరి ఓవర్‌లో పది పరుగులుగా మారింది. 
 
అర్ష్‌దీప్ వేసిన ఈ ఓవర్‌లో మొదటి బంతికే కార్తీక్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత బంతి వైడ్ కావడంతో ఒక పరుగు వచ్చింది. ఆ తర్వాత బంతిని కూడా కార్తీక్ ఫోర్‌గా మలచడంతో ఆర్సీబీ జట్టు గెలుపొందింది. దినేశ్ కార్తీక్ (28), లోమ్రోర్ (17) చొప్పున కీలకమైన పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రబడ, బ్రార్‌లు తలా రెండేసి వికెట్లు తీశారు. సామ్ కర్రాన్, హర్షల్ పటేల్‌లు  చెరో వికెట్ తీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు