స్ఫూర్తిదాయకమైన సినినాలు చూశాం.. కానీ నిజజీవిత కథకు అవేమీ దగ్గరగా లేవు... : సూర్య కుమార్

వరుణ్

ఆదివారం, 24 మార్చి 2024 (12:54 IST)
గత యేడాది ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై వాటి నుంచి కోలుకొని పూర్తి ఫిటెనెస్‌తో మళ్లీ  క్రికెట్ మైదానంలో అడుగుపెట్టడం అంత సులభమైన విషయం కాదు. కానీ భారత ఆటగాడు రిషబ్ పంత్ మాత్రం దాన్ని వాస్తవ రూపంలో సుసాధ్యం చేశారు. అసాధారణ రీతిలో కోలుకొని తిరిగి ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున అదీ కూడా ఏకంగా కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. దీంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ద్వారా పునరాగమనం చేసిన పంత్‌పై టీమిండియా డ్యాషింగ్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ పొగడ్తల వర్షం కురిపించాడు. 
 
'మనమంతా ఎదురుచూసిన క్షణం ఇది. స్ఫూర్తిదాయకమైన సినిమాలు చాలానే చూశాను. కానీ నిజ జీవిత కథకు అవేవీ దగ్గరగా లేవు' అని పంత్ కోలుకున్న విధానాన్ని సూర్య ప్రశంసించాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సూర్య స్పందించాడు. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో పంత్ మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఇరు జట్ల అభిమానులు లేచి నిలబడ్డారు. చప్పట్లు, కేరింతలతో మైదానాన్ని మోతెక్కించారు.
 
పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. తిరిగి మైదానంలోకి వచ్చినందుకు దేవుడికి, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నాడు. తిరిగి మైదానంలో అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నాడు. మ్యాచ్లో ఆశించిన ఫలితం రాలేదని, క్రమక్రమంగా మెరుగుపడతానని పంత్ చెప్పాడు. 100 శాతం నిబద్ధతతో మెరుగుపడేందుకు కృషి చేస్తానని చెప్పాడు. మైదానంలో ఉండటాన్ని చాలా ఇష్టపడతానని పంత్ వివరించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు