అర్థరాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లి కత్తితో పొడిచిన ప్రియురాలు..

మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (10:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పెనమలూరులో ఓ యువతి తన ప్రియుడిని కత్తితో పొడించింది. అర్థరాత్రి పూట ప్రియుడి ఇంటికి తన తల్లితో కలిసి వెళ్లిన ఆమె... ఈ దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఎన్టీఆర్‌ జిల్లా పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు సనత్‌ నగర్‌కు చెందిన లంకే నాగరాజు ఆటోనగర్‌లో లారీ బాడీ బిల్డింగ్‌ వర్క్‌షాపులో వెల్డర్‌గా పనిచేస్తుంటాడు. నాగరాజు గత ఆరేళ్ల నుంచి లా చదువుతున్న ఓ విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. 
 
అయితే, ఇటీవల ఆమె మనసు మార్చుకుని తాను బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న యువకుడిని వివాహం చేసుకోవాలని భావించింది. తన మనస్సులోని మాటను కూడా నాగరాజుకు తెలిపింది. పైగా, ఫోనులో ఉన్న ఫొటోలు, మెసేజ్‌లు డిలీట్ చేయాలని కోరింది. దీనికి నాగరాజు అంగీకరించలేదు.
 
దీంతో ఆగ్రహం చెందిన ఆ యువతి.. ఈ నెల 2వ తేదీ అర్థరాత్రి తన తల్లితో కలిసి నాగరాజు ఇంటికి వెళ్లి అతడిని నిద్రలేపారు. తన కుమార్తె స్నేహితురాలిగానే వ్యవహరిస్తోంది కదా.. ఫొటోలు, మెసేజ్‌లు తీసేయకుండా ఎందుకు ఏడిపిస్తున్నావంటూ ఆమె తల్లి నాగరాజును ప్రశ్నిస్తూ ఫోన్‌ తీసుకొని అతడిని కత్తితో పొడిచింది. 
 
ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురైన నాగరాజు పెద్దగా కేకలు వేయడంతో తల్లీకూతురు అక్కడ నుంచి వెళ్లిపోయారు. స్థానికులు నాగరాజును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు