డబ్బుల కోసం వేధిస్తున్న కుమారుడిని హత్య చేసిన తండ్రి... ఎక్కడ?

వరుణ్

సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (08:31 IST)
నిత్యం మద్యం సేవించి వచ్చి, డబ్బుల కోసం వేధిస్తున్న కుమారుడిని కన్నతండ్రి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన షామీర్ పేట మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, షామీర్ పేట మండలంలోని లాల్ గడి గ్రామంలో రామ్ చందర్, మంజుల కుమారుడు కొరివి నరేష్(28) వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
 
గ్రామానికి చెందిన కొరివి నరేశ్ ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి కనిపించట్లేదని 22వ తేదీన తల్లి మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా తన తండ్రి రామచందర్ కన్నకొడుకును హత్య చేశాడని నిర్ధారించారు. మద్యానికి బానిసై డబ్బుల కోసం నిత్యం వేధిస్తున్నాడనే కోపంతో హత్య చేశానని పోలీసు విచారణలో తండ్రి అంగీకరించాడు. 
 
కుమారుడికి మద్యం తాగించి రూ.10 వేలు ఇస్తానని గ్రామ సమీపంలో ఉన్న ఓ బావి దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ కుమారుడు నరేశ్‌కు పీకల వరకు మద్యం తాగించి అనంతరం బావిలో తోసేశాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా కొడుకు కనబడటం లేదని కుటుంబ సభ్యులకు తెలిపాడు. భయంతో తల్లి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు తండ్రి రామచందర్‌పై అనుమానం వచ్చి విచారించడంతో తానే చంపానని తెలిపాడు. మృతుడు నరేశ్‌కి వివాహమై ఏడాదిన్నర పాప ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు