ఉద్యోగం పేరుతో మహిళకు గాలం.. 22 బంధించి అత్యాచారం.. ఎక్కడ?

మంగళవారం, 8 ఆగస్టు 2023 (14:58 IST)
ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళకు గాలం వేసిన ఓ వ్యక్తి.. ఆ మహిళను ఏకంగా 22 రోజుల పాటు గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాష్ట్రంలోని హరిద్వార్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌‌కు చెందిన ఒక వివాహితకు నదీమ్‌ అనే వ్యక్తితో కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. అందుకోసం మహిళను జులై 7వ తేదీన తనతో పాటు హరిద్వార్‌కు తీసుకువచ్చాడు. తర్వాత మహ్మద్‌ షకీబ్‌ అనే వ్యక్తిని ఆమెకు పరిచయం చేశాడు. 
 
ఈ క్రమంలో షకీబ్‌ ఆమెకు మత్తు మందు ఇచ్చి బంధించాడు. 22 రోజుల పాటు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి అతడి భార్య అయేషా కూడా సహకరించింది. ఈ క్రమంలో బాధిత మహిళ ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ.. హరిద్వార్‌ వీధుల్లో తిరుగుతూ పోలీసుల కంటపడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 
 
అనంతరం బాధితురాలి వివరాలు తెలుసుకున్నారు. ఆమె భర్తను పిలిపించి మాట్లాడించారు. దీంతో ఆమె అసలు విషయం బయట పెట్టింది. అనంతరం పోలీసులు ఆమెకి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు