బడ్జెట్ 2021డే పైన రైతులు టార్గెట్: పార్లమెంటుకి పాదయాత్రకి పిలుపు (video)

బుధవారం, 27 జనవరి 2021 (14:10 IST)
రాజధానిలో రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 22 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ ర్యాలీలో సుమారు 100 మంది పోలీసులు గాయపడ్డారని అధికారులు బుధవారం తెలిపారు. మంగళవారం రిపబ్లిక్ డే రోజున జరిగిన ట్రాక్టర్ పరేడ్ హింసాత్మకంగా మారింది. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతు సంఘాల డిమాండ్లు ఈ ర్యాలీలో పక్కదోవ పట్టాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఎర్రకోట వద్దకు చేరుకునేందుకు వేలాది మంది నిరసనకారులు రోడ్లపై పోలీసులు వేసిన కంచెలను దాటుకుని, అడ్డు వచ్చిన పోలీసులను కర్రలతో వెంబడించిన దృశ్యాలు కనబడ్డాయి. వేల సంఖ్యలో రైతులు ఎర్రకోట వద్దకు చేరుకుని కోటపై జెండా ఎగురవేసారు. మంగళవారం జరిగిన హింసాకాండకు సంబంధించి ఇప్పటివరకు 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
భారతదేశ వ్యవసాయ మార్కెట్లకు సంబంధించిన మూడు చట్టాలకు నిరసనగా రైతులు, ఎక్కువగా పంజాబ్ మరియు హర్యానాకు చెందినవారు పాల్గొన్నారు. ఢిల్లీ వెలుపల రెండు నెలలుగా నిరసన చేస్తున్న రైతు సంఘాలతో తొమ్మిది రౌండ్ల చర్చలు విఫలమయ్యాయి. వ్యవసాయ చట్టాల రద్దుకు బదులు ఏడాదిన్నర వాయిదా వేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ చట్టాలను పూర్తిగా రద్దు చేయమని ఒత్తిడి చేశారు.
 
మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో సహా తమ డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చేందుకు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ సమర్పించే సమయంలో పార్లమెంటుకు ఫుట్ మార్చ్ ప్రకటించారు.
రైతుల హింసపై సుప్రీంలో పిటీషన్
రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో నిరసన వ్యక్తం చేస్తూ రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండను విచారించాలని రిటైర్డ్ అపెక్స్ కోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. హింసాకాండకు కారణమైన వ్యక్తులు, సంస్థలపై సంబంధిత శిక్షా నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్‌ను సమర్పించాలని, జనవరి 26న జాతీయ పతాకాన్ని అగౌరవపరిచేలా చేయమన్న వారిపై విచారించాలని పిటిషన్ కోరింది.
ట్రాక్టర్ పరేడ్ హింసపై చర్చించడానికి రైతు సంఘాల సమావేశం
దేశ రాజధానిలో రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసపై చర్చించడానికి రైతు సంఘాల నాయకులు బుధవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి 32 పంజాబ్ యూనియన్ల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఒక సీనియర్ రైతు నాయకుడు మాట్లాడుతూ, "కిసాన్ మోర్చా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమై ఢిల్లీలో ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జరిగిన హింసకు సంబంధించిన అన్ని అంశాలను చర్చిస్తారు".
కాగా గణతంత్ర దినోత్సవం నాడు చెలరేగిన హింస నేపధ్యంలో ఫిబ్రవరి 1న బడ్జెట్ డే నాడు రైతుల పార్లమెంట్ మార్చ్‌కి పోలీసులు అనుమతులు ఇస్తారో లేదోనన్నది వేచి చూడాల్సి వుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు