కిడ్నీ‌లో రాళ్ళను నివారించే 'ఔషధ గుణాల' యాలకులు..!

శనివారం, 30 జనవరి 2016 (10:23 IST)
చక్కని రుచితోపాటు సువాసనను అందించే యాలకులను మనం నిత్యం వివిధ రకాల వంటకాల్లో వాడుతుంటాం. అయితే ఇది కేవలం ఆహారానికి మాత్రమే కాకుండా ఆరోగ్యకర ప్రయోజనాలనిచ్చే ఔషధంగానూ మనకు ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
తరచూ యాలకులను తీసుకుంటే  మూత్రాశయం, కిడ్నీ‌లో రాళ్ళు మూత్రంలో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లకు ఔషధంగా పనిచేస్తుంది. బీపీని తగ్గిస్తుంది. కిడ్నీల్లో పేరుకుపోయిన కాల్షియం, యూరియా సంబంధ పదార్థాలను బయటకి పంపిస్తుంది. 
 
యాలకులతో జీర్ణ సంబంధ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కడుపులో మంట, అసిడిటీ తదితర అనారోగ్యాలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్దకం తొలగిపోతుంది. యాలకులను నమలడం వల్ల ఆకలి కూడా పెరుగుతుంది. 
 
రక్తహీనతను నివారించే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు యాలకుల్లో ఉన్నాయి. రక్తహీనత వల్ల వచ్చే అలసట, నిస్సత్తువ వంటి లక్షణాలను యాలకుల్లోని కాపర్, ఐరన్, మాంగనీస్, రైబోఫ్లేవిన్, విటమిన్ సి, నియాసిన్ వంటివి తగ్గిస్తాయి. ఇవి ఎర్రరక్తకణాల సంఖ్యను కూడా పెంచుతుంది. మెటబాలిజయం ప్రక్రియను మెరుగు పరుస్తాయి. ఒక గ్లాస్ వేడి పాలలో కొంత పసుపును, యాలకుల పొడిని కలిపి రోజూ రాత్రి పూట తీసుకుంటే నీరసం తగ్గుతుంది. రక్తహీనత వల్ల వచ్చే ఇతర అనారోగ్యాలు కూడా దూరమవుతాయి. 
 
యాలకులు, దాల్చినచెక్కల పొడిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయాన్నే గొంతులో వేసుకుని పుక్కిలిస్తే గొంతులో మంట, నొప్పి వంటివి తగ్గుతాయి. 
 
భోజనం చేసిన ప్రతిసారీ కొన్ని యాలకులను తింటే నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే యాలకుల టీని తాగినా నోటి దుర్వాసన దూరమవుతుంది. 

వెబ్దునియా పై చదవండి