కరోనా మహమ్మారితో మానవులకే కాదు.. జీవజాతులన్నింటికీ ముప్పే..!

సోమవారం, 24 ఆగస్టు 2020 (11:18 IST)
కరోనా మహమ్మారితో ముప్పు మానవులకే పరిమితం కాదని అనేక జీవజాతులకు కరోనా ముప్పు పొంచి వుందని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తీవ్రస్థాయిలో అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న అనేక వానర జాతులకూ ఈ మహమ్మారితో ప్రమాదం ఉందని తేల్చారు. ఈ మేరకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయ్యింది.
 
మానవుల నుంచి వీటికి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఈ మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. అటు మానవులతోపాటు ఇటు జంతువుల ఆరోగ్యంపైనా దృష్టిసారించాల్సిన ఆవశ్యకతను తమ పరిశోధన వెలుగులోకి తెచ్చిందన్నారు.
 
మానవుల కణాల్లోకి ప్రవేశించడానికి కరోనా వైరస్‌.. ఏసీఈ2 గ్రాహక ప్రొటీన్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వివిధ జీవ జాతుల్లో ఈ ప్రొటీన్‌ నిర్మాణ తీరును పరిశీలించడానికి జన్యు విశ్లేషణను చేపట్టారు. ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లోని పైపూత సహా అనేక కణాలు, కణజాలాల్లో ఈ ప్రొటీన్‌ ఉంటుంది. ఏసీఈ2లో అనేకరకాల అమినో ఆమ్లాలు ఉంటాయి.
 
వీటిలో 25 ఆమ్లాలు కరోనా కారక వైరస్‌ మానవ కణాల్లో ప్రవేశించడానికి వీలు కల్పిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్ని జాతుల్లో ఈ రకాలు ఉన్నాయన్నది దృష్టి సారించారు. ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉన్న జీవజాతుల్లో 40 శాతం జాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని తేల్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు