డాట్ బాల్సే కొంపముంచాయి... ఓటమికి నేనే బాధ్యుడిని : డేవిడ్ వార్నర్

ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (11:49 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి అబుదాబీ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. కేకేఆర్ నిర్దేశించిన స్వల్ప విజయలక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఓడిపోయింది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. 
 
గత రాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో తమ అభిమాన జట్టు ఓడిపోవడాన్ని సన్ రైజర్స్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ మ్యాచ్‌లో కేన్ విలియన్సన్ ఆడకపోవడం, మనీశ్ మినహా మిగతా వారు ఎవరూ సరిగ్గా ఆడకపోవడంతో హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. 
 
ఈ మ్యాచ్ ఓటమిపై సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించారు. కేకేఆర్‌తో ఆటలో జట్టు ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదని చెప్పాడు. తొలి ఓవర్లలో లభించిన మంచి రన్ రేట్‌ను కొనసాగించ లేకపోయామన్నాడు. 
 
ఇందుకు తాను ఎవరినీ నిందిచాలని భావించడం లేదని, తప్పంతా తనదేనని, ఈ ఓటమికి బాధ్యతను కూడా తీసుకుంటున్నానని అన్నాడు. తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడాలన్న ఆలోచనతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన తాను, దాన్ని కాపాడుకోలేక పోయానని చెప్పాడు.
 
వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన తాను అనవసరంగా అవుట్ అయి, పెవిలియన్ చేరానని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన తమ జట్టు, బెంచ్‌పై ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లను ఉంచుకుని కూడా పెద్ద స్కోరును సాధించడంలో విఫలం అయ్యామని వివరించాడు. 
 
ముఖ్యంగా, 16వ ఓవర్ తర్వాత వేగం పెంచాల్సిన ఆటగాళ్లు ఆ పని చేయడంలో విఫలం అయ్యారని అన్నాడు. ఈ మ్యాచ్ లో దాదాపు 6 ఓవర్లు డాట్ బాల్స్ ఉన్నాయని, టీ-20లో ఇన్ని డాట్‌బాల్స్ ఉంటే, మ్యాచ్ గెలవడం కష్టమవుతుందని, తదుపరి వచ్చే మ్యాచ్‌లలో మైండ్ సెట్‌ను మార్చుకుని బరిలోకి దిగుతామని అన్నాడు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు