గత యేడాదిలో 67 వేల మంది టెక్ ఉద్యోగులకు ఉద్వాసన

వరుణ్

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (09:43 IST)
గత యేడాది అంటే 2023లో ఏకంగా 67 వేల మంది టెక్ ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. వీరంతా టెక్ దిగ్గజ కంపెనీల్లో పని చేసే టెక్కీలు కావడం గమనార్హం. ముఖ్యంగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీల యాజమాన్యాలు గత యేడాది 67 వేల మంది టెక్కీలను తొలగించాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. టెక్ జెయింట్ ఇన్ఫోసిస్ కంపెనీ ఏకంగా 24182 మందిని తొలగించింది. అలాగే, విప్రో 21875 మందిని పంపించగా, టెక్ మహీంద్రా కంపెనీ 10669 మందిని, టీసీఎస్‌ 10818 మందికి  ఉద్వాసన పలికింది. 
 
ఉద్యోగుల తొలగింపు విషయం పక్కనపెడితే 2023లో ఐటీ కంపెనీలు పెద్దగా నియామకాలు చేపట్టలేదని ఓ మీడియా సంస్థ వెల్లడించిన నివేదికలో పేర్కొంది. అంతక్రితం ఏడాది 2022తో పోల్చితే డిసెంబర్ 2023లో ఐటీ జాబ్ ఆఫర్ల సంఖ్య 21 శాతం క్షీణిందని రిపోర్ట్ పేర్కొంది. వ్యయాల తగ్గింపే లక్ష్యంగా కంపెనీలు మరిన్ని చర్యలకు ఉపక్రమించాయని, జాబ్ ఆఫర్ ప్యాకేజీలను కూడా తగ్గించాయని తెలిపింది. టెక్ దిగ్గజం విప్రో మొదట్లో ఫ్రెషర్లకు రూ.6.5 లక్షల శాలరీ ఆఫర్ చేయగా.. దానిని గణనీయంగా తగ్గించాలని గతేడాది ఫిబ్రవరిలో నిర్ణయించుకుందని వివరించింది.
 
ప్యాకేజీ ఎక్కువ ఆశించిన ఉద్యోగులను కంపెనీ పట్టించుకోలేదని, తక్కువ శాలరీకి అంగీకరించిన ప్రెషర్లను మాత్రమే కంపెనీలోకి తీసుకుందని రిపోర్టులు ప్రస్తావించాయి. ఇక మరో టెక్ ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ నియామకాలను తగ్గించుకోవాలని సూస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే శిక్షణ పొందుతున్న ఫ్రెషర్లు సరిపడా ఉండడంతో ప్రెషర్ల నియామక ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని భావిస్తున్నట్టుగా గతేడాది అక్టోబరు నెలలో ఇన్ఫోసిస్ వెల్లడించిన విషయం తెలిసిందే.
 
కాగా 2023లో టెక్ ఉద్యోగుల తొలగింపు ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున టెక్కీల ఉద్యోగాలు ఊడాయి. ఎక్స్ (గతంలో ట్విటర్), మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ పాటు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ప్రభావిత ఉద్యోగులు లింక్డ్‌ఇన్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా తమ ఇబ్బందులను వెల్లడించిన విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు