లోక్‌సభ ఎన్నికలు 2024 : మూడో దశ పోలింగ్‌లో ఓటు వేసిన ప్రధాని మోడీ

ఠాగూర్

మంగళవారం, 7 మే 2024 (09:31 IST)
దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం 7 గంటలకు మూడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో గుజరాత్ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
అహ్మదాబాద్ నగర్‌లోని రాణిప్ ప్రాంతంలో ఉన్న నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ఆయన ఓటు వేశారు. ఉదయం 7:30 గంటల సమయంలో ప్రధాని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. మోడీకి కేంద్ర మంత్రి అమిత్ షా స్వాగతం పలకగా.. ఇద్దరు నేతలు బూత్ వద్దకు వెళ్లారు. కాగా ప్రధానిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. రోడ్డు పక్కన నిలబడి మోడీ అనుకూల నినాదాలు చేశారు. ఒక అభిమాని మోడీ చిత్రపటాన్ని తీసుకొని రాగా దానిపై ప్రధాని ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
 
బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనాలను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందని, కాబట్టి అందరూ తరలి వచ్చి ఓటు వేయాలని దేశ పౌరులను కోరారు. దేశంలో దానానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఇదే స్ఫూర్తితో దేశ ప్రజలు వీలైనంత ఎక్కువ మంది ఓటు వేయాలని సూచించారు. ఇంకా నాలుగు దశల పోలింగ్ మిగిలివుందని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. 
 
లోక్‌సభ ఎన్నికలు 2024 : ప్రశాంతంగా సాగుతున్న మూడో దశ పోలింగ్ 
 
లోక్‌సభ ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్ మొదలై ప్రశాంతంగా సాగుతుంది. ఈ ఎన్నికల్లోపది రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 ‌లోక్‌సభ స్థానాలకు మంగళారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అలాగే, ఓట్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. వేసవితాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వెళ్తున్నారు. 
 
2019 లోకసభ ఎన్నికల్లో ఈ 93 స్థానాల్లోని 72 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఒక్క గుజరాత్‌లోనే ఆ పార్టీ 26 సీట్లను దక్కించుకుంది. మూడో దశలో అసోం- 4 సీట్లు, బీహార్-5, ఛత్తీస్ గఢ్ -7, గోవా-2, గుజరాత్-26, కర్ణాటక-14, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఉత్తరప్రదేశ్ - 10, పశ్చిమ బెంగాల్-4, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ-2లలో పోలింగ్ జరుగుతోంది. 
 
మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ లోకసభ స్థానానికి కూడా పోలింగ్ మొదలైంది. రెండో దశలోనే ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో మూడో దశకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ దశలో మొత్తం 1,300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో సుమారు 120 మంది మహిళలు ఉన్నారు.
 
కాగా, మూడో దశ పోలింగ్‌లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వరాష్ట్రమైన గుజరాత్‌లో వీరు ఓటు వేయనున్నారు. గాంధీనగర్ స్థానం పరిధిలోని అహ్మదాబాద్‌‍లో ప్రధాని మోడీ ఓటు వేయనున్నారు. ఇక ఇదే నియోజకవర్గ పరిధిలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఓటు వేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు