త్వరలో భారత్‌కి 10 కోట్ల డోసుల రష్యా వ్యాక్సిన్‌ .. 30 కోట్ల డోసుల ఉత్పత్తికి ఒప్పందాలు

గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:10 IST)
ప్రపంచంలోనే మొట్టమొదటి రిజిస్టర్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’ 10 కోట్ల డోసులు భారత్‌ ప్రజలకు అందుబాటులో రానుంది. భారత్‌లో కూడా వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేపట్టనున్నట్లు రష్యా డైరెక్ట్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డిఐఎఫ్‌) తెలిపింది.

భారత్‌లోని వ్యాక్సిన్‌ తయారీ సంస్థల సహకారంతో 30 కోట్ల డోసుల ఉత్పత్తికి రష్యా ఒప్పందాలు కుదుర్చుకోగా, వాటిలో 10 కోట్ల డోసులను డాక్టర్‌ రెడ్డీస్‌ ద్వారా దేశంలో పంపిణీ చేయించనుంది. ఈ వివరాలను డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌ జి.వి.ప్రసాద్‌ కూడా ధ్రువీకరించారు.

‘స్పుత్నిక్‌-వి’ మూడోదశ ప్రయోగ పరీక్షలు, పంపిణీ విషయంలో ఆర్‌డీఐఎ్‌ఫతో కలిసి పనిచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ట్రయల్స్‌కు అనుమతుల అంశం ప్రస్తుతం ఔషధ నియంత్రణ సంస్థల పరిశీలనలో ఉందని తెలిపారు.

2020 చివరి నాటికి భారత్‌కు ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేయనున్నామని, అయితే భారత్‌లోని రెగ్యులేటరీ అధికారుల అనుమతికి లోబడి ఉంటుందని ఆర్‌డిఐఎఫ్ తెలిపింది. ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ను రష్యా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు