జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అలక.. సీఎం చంపయి సొరేన్‌కు కష్టాలు?

వరుణ్

ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (15:34 IST)
జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంపాయి సొరేన్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అలకబూనారు. దీంతో చంపయి సొరేన్ మంత్రివర్గంలోని తమ సొంత పార్టీకి చెందిన నలుగురు మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తూ, అలకబూనారు. లేనిపక్షంలో ఈ నెల 23వ తేదీ నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని దాదాపు 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అల్టిమేటం జారీచేశారు. వీరంతా శనివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకొన్నారు. పార్టీ హైకమాండ్‌ ఎదుట తమ నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు.  
 
తమ పార్టీకి చెందిన ఆలంగిర్‌ ఆలమ్‌కు, రామేశ్వర్‌ ఓరోన్‌, బన్నా గుప్తా, బాదల్‌ పత్రలేకఖ్‌కు ఇటీవల చంపయీ సోరెన్‌ మంత్రి వర్గంలో స్థానం కల్పించిన విషయం తెలిసిందే. వాస్తవానికి వీరి పేర్లను కేబినెట్‌లో ప్రకటించిన వెంటనే ఎమ్మెల్యేలు రాజ్‌‌భవన్‌లో ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంతో 47 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 29 మంది జేఎంఎంకు చెందినవారు.. కాంగ్రెస్‌ - ఆర్జేడీకి చెందిన మరో 17 మంది ఉన్నారు. అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలున్నాయి. పార్టీ నేత గులాం అహ్మద్‌ మిర్‌, పీసీసీ చీఫ్‌ రాజేష్‌ వారిని సముదాయించారు.  
 
'మాకు ఒక్కో డివిజన్‌ నుంచి మంత్రి పదవి కావాలి. రాష్ట్రంలో ఐదు డివిజన్లను మేం కవర్‌ చేస్తాము. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న నిబంధనను అమలు చేయాలి. ఒక వేళ ఆలం మంత్రి వర్గంలో కొనసాగితే.. సీఎల్‌పీ పదవిని వదులుకోవాలి' అని అసంతృప్త ఎమ్మెల్యే కుమార్‌ జైమంగళ్‌ తెలిపారు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వం తమ మాటను పట్టించుకోకపోతే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లిపోతామని అనూప్‌ సింగ్‌ హెచ్చరించారు. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు ఈ మేరకు లిఖిత పూర్వకంగా పార్టీ నాయకత్వానికి డిమాండ్ల లేఖను అందజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు