భారత రైతులకు అమెరికా నేతల ప్రశంస

బుధవారం, 9 డిశెంబరు 2020 (08:16 IST)
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌లో ఆందోళన చేపట్టిన రైతులకు అమెరికన్‌ ప్రజాప్రతినిధులు బాసటగా నిలిచారు. ”భారతదేశంలోని పంజాబీ రైతులు తమ జీవనోపాధి కోసం నిరసన తెలుపుతున్నారు.. తప్పుదారి పట్టించే, తారుమారు చేసే ప్రభుత్వ నిబంధనల నుంచి రైతులకు రక్షణ కోసం సంఘీభావం తెలుపుతున్నాం” అని కాలిఫోర్నియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డౌగ్‌ లామాల్ఫా అన్నారు.

పంజాబీ రైతులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలపడానికి అనుమతించాలని కోరారు. ”భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం – శాంతియుత నిరసనను ప్రభుత్వం అనుమతించాలి.. రైతులతో ప్రధాని నరేంద్ర మోడీ శాంతియుత, ఫలవంత చర్చలు జరపాలని నేను కోరుకుంటున్నాం” అని డెమోక్రటిక్‌ కాంగ్రెస్‌ సభ్యుడు జోష్‌ హార్డర్‌ అన్నారు.

నిరసన తెలిపే రైతుల హక్కులను గౌరవించాలి.. అర్ధవంత చర్చలే పరిష్కార మార్గం అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ డెమోక్రటిక్‌ సభ్యుడు ఆండీ లెవిన్‌ మాట్లాడుతూ భారతదేశంలో రైతుల ఉద్యమం నుంచి ప్రేరణ పొందాననని, ”నేను దీనిని 2021 లో ప్రజాశక్తి సంవత్సరానికి సూచికగా చూస్తున్నా” అన్నారు.

అమెరికా మీడియా దృష్టి
భారతదేశంలో రైతుల నిరసనలపై అమెరికా ప్రధాన మీడియా దృష్టిని ఆకట్టుకున్నాయి. ”నిరసనలు న్యూఢిల్లీని దాటి వ్యాపించాయి. దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలో, ఈశాన్య రాష్ట్రం అసోంలో రైతులు కవాతు చేసి బ్యానర్లు ఏర్పాటు చేశారు.. వ్యవసాయ చట్టాల వల్ల తక్కువ ప్రభావాన్ని ఎదుర్కొనే ఉత్తర ప్రదేశ్‌లోని చెరకు రైతులు కూడా సంఘీభావంగా ఢిల్లీ సరిహద్దు నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ”అని న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదించింది.

”వేలాది మంది రైతులు భారతదేశ రాజధానిని స్వాధీనం చేసుకున్నారు.. తమ జీవనోపాధిని నాశనం చేయవచ్చని భావిస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ వారాలపాటు తిష్ట వేసి నిరసనలు కొనసాగించాలని భావిస్తున్నారు”అని సిఎన్‌ఎన్‌ నివేదిక పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు