అభిజిత్ లగ్నంలో దశరథ నందనుడి ప్రాణప్రతిష్ట

వరుణ్

సోమవారం, 22 జనవరి 2024 (12:40 IST)
అయోధ్య నగరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రామ మందిరంలో అయోధ్య శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ట ఘట్టం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో దశరథ నందనుడికి ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోడీ, వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లులతో పాటు మరికొందరు ఆలయంలో ఉన్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం తర్వాత రామ మందిరంతో పాటు అయోధ్య నగరంలో హెలికాఫ్టర్లతో పూలవర్షం కురిపించారు. 
 
కాగా, ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా చూసేందుకు దేశం నలు మూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. దేశ వ్యాప్తంగా జై శ్రీరామ్ నామ స్మరణ మార్మోగిపోతుంది. అయోధ్య నగరంలో 'జై శ్రీరామ్‌' నినాదాలతో అక్కడి వీధులన్నీ మార్మోగుతున్నాయి. 
 
ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు రామ మందిరం వద్దకు చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రముఖ సినీ, క్రీడా ప్రముఖులు రజనీకాంత్‌, చిరంజీవి, అమితాబ్‌బచ్చన్‌, సచిన్‌ టెండూల్కర్, అనిల్‌ కుంబ్లే, జాకీ ష్రాఫ్‌, రామ్‌దేవ్‌ బాబా తదితరులు వచ్చారు.  ‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’ అధినేత ముకేశ్‌ అంబానీ దంపతులు, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ అక్కడికి చేరుకున్నారు. 
 
మరోవైపు అయోధ్యలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రామాయణ ఘట్టాలను వివరిస్తూ పలువురు గాయకులు గీతాలను ఆలపిస్తున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు