సుప్రీంకోర్టు కుక్‌ కుమార్తెను సన్మానించిన సీజేఏ చంద్రచూడ్

ఠాగూర్

గురువారం, 14 మార్చి 2024 (09:14 IST)
భారత సుప్రీంకోర్టులో కుక్‌గా పని చేస్తున్న అజయ్ కుమార్ కుమార్తె ప్రజ్ఞను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ప్రత్యేకంగా సన్మానించారు. అమెరికాలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసేందుకు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్శిటీ ఆఫ్ మిషిగన్ ఉపకార వేతనాలు ప్రజ్ఞ దక్కించుకున్నారు. దీంతో ఆమె బుధవారం జడ్జిల లాంజ్‌లో స్టాండింగ్ ఓవేషన్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా సన్మానించారు. 
 
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ, 'తనంతట తానుగా ప్రజ్ఞ ఈ ఘనత సాధించింది. ఆమెకు కావాల్సినవన్నీ అందేందుకు మేము అన్ని రకాలుగా సాయం చేస్తాం. మళ్లీ ఆమె స్వదేశానికి తిరిగొచ్చి దేశసేవ చేయాలని ఆశిస్తున్నాం. తను ఎంచుకున్న రంగంలో ఆమె అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తుందన్న నమ్మకం ఉంది. 1.4 బిలియన్ల భారతీయుల కలలను ఆమె తన వెంట తీసుకెళుతోంది' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞకు చీఫ్ జస్టిస్.. భారత రాజ్యాంగానికి సంబంధించి సుప్రీం న్యాయమూర్తులందరూ సంతకాలు చేసిన మూడు పుస్తకాలను కూడా బహూకరించారు. అనేక కష్టనష్టాలకోర్చి కూతురిని పెంచి పెద్ద చేసిన ప్రజ్ఞ తల్లిదండ్రులను కూడా శాలువా కప్పి సన్మానించారు.
 
అలాగే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ ప్రజ్ఞ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన కెరీర్‌లో పురోగతి తల్లిదండ్రుల వల్లే సాధ్యమైందన్నారు. 'వారికి కూతురుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. స్కూల్ రోజుల నుంచీ నాన్న నాకు అన్ని రకాలుగా సాయం చేశారు. నాకు అన్ని అవకాశాలు దక్కేలా చర్యలు తీసుకున్నారు' అని పేర్కొన్నారు. తాను న్యాయవాద వృత్తిని ఎంచుకునేందుకు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ స్ఫూర్తిగా నిలిచారని, ఆయన కేసు విచారణల లైవ్ స్ట్రీమింగ్ వల్ల ఆయన వ్యాఖ్యలను నేరుగా వినే అవకాశం అందరికీ దక్కిందని, ఆయన వ్యాఖ్యలు రత్నాలని, ఆయనే తనకు స్ఫూర్తి అని ప్రజ్ఞ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు