అత్యాచార బాలికను కలవకుండా అడ్డుకున్న పోలీసులు.. నేలపై పడుకున్న స్వాతి మాలీవాల్

మంగళవారం, 22 ఆగస్టు 2023 (12:52 IST)
ఢిల్లీలో 17 యేళ్ల మైనర్ బాలికపై ప్రభుత్వ అధికారి ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చగా, ఆ ప్రభుత్వ అధికారి భార్య గర్భస్రావం చేయించింది. ప్రస్తుతం ఈ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అయితే, బాధిత బాలికను చూసి పరామర్శించేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్ ఆస్పత్రికి వెళ్లగా, పోలీసులు మాత్రం ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధిత బాలికను కలిసేంత వరకు తాను ఆస్పత్రి నుంచి కదిలేది లేదని ప్రకటించి, ఆ రాత్రికి ఆస్పత్రిలోనే నేలపై పడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
దీనిపై స్వాతి మాలీవాల్ స్పందిస్తూ, పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని, బాధిత బాలికను కానీ, ఆమె తల్లిని కానీ కలుసుకునేందుకు అంగీకరించడం లేదని ఆరోపించారు. తన నుంచి వారు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. బాధిత బాలికను కలిసేందుకు తనను అనుమతించాల్సిందిగా బాలల హక్కుల కమిషన్ (ఎన్సీపీసీఆర్)ను కోరినట్టు తెలిపారు.
 
ఎన్సీపీసీఆర్ చీఫ్ బాధిత బాలిక తల్లిని కలిసినప్పుడు తననెందుకు అడ్డుకుంటున్నారని స్వాతి ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం నుంచీ ఆసుపత్రిలోనే ఉన్న ఆమె బాధితురాలిని కలిశాకే అక్కడి నుంచి కదులుతానని స్పష్టం చేశారు.
 
కాగా, ఢిల్లీ ప్రభుత్వంలోని మహిళా, శిశు అభివృద్ధి విభాగం డిప్యూటీ డైరెక్టర్ ప్రేమోదయ్ ఖాఖా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాలిక గర్భం దాల్చడంతో నిందితుడి భార్య సీమా రాణి ఆమెకు గర్భనిరోధక మాత్రలు వేసి గర్భంస్రావం చేసినట్టు బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ఖాఖా, ఆయన భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు పశ్నిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు