ఈవీఎం బటన్ నొక్కాలంటే గ్లౌవ్స్ ధరించాల్సిందే.. నిబంధనలు మార్చేసిన ఈసీ

శుక్రవారం, 21 ఆగస్టు 2020 (19:03 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచ స్థితిగతులన్నీ తలకిందులయ్యాయి. ప్రజల జీవన ప్రమాణాలన్నీ తారుమారయ్యాయి. మన దేశంలో కూడా ఎన్నో రకాలైన ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కరోనా వైరస్ పుణ్యమాని చివరకు ఎన్నికల నిబంధనలు కూడా మారిపోతున్నాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అనేక కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 
 
ఈ నిబంధనల మేరకు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదన్న నిబంధన విధించింది. ఓటు వేసే సమయంలో ఓటర్లు సామాజిక దూరాన్ని పాటించాలని, ఓటర్లందరికీ గ్లవ్స్ ఇవ్వాలని... ప్రతి ఓటరు గ్లవ్స్ ధరించి ఈవీఎం బటన్‌ను నొక్కాలని తెలిపింది. 
 
ముఖ్యంగా, పోలింగ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని పేర్కొంది. పబ్లిక్ మీటింగులు, రోడ్ షోలను నిర్వహించుకోవచ్చని... అయితే, కేంద్ర హోంశాఖ విధించిన కోవిడ్ నిబంధనలకు లోబడే ఈ సభలు, సమావేశాలు ఉండాలన్న షరతు విధించింది. 
 
అభ్యర్థులందరూ నామినేషన్లను ఆన్‌లైన్‌లోనే దాఖలు చేయాలని ఈసీ తెలిపింది. సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా ఆన్ లై‌న్‌లోనే చెల్లించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో మాస్కులు, శానిటైజర్లు ఉండాలని చెప్పింది. థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉండాలని తెలిపింది. వీటితో పాటు అనేక నిబంధనలు తీసుకొచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు