జ్ఞానవాపి మసీదు కేసులో శాస్త్రీయ సర్వేకు వారణాసి కోర్టు సమ్మతం

శుక్రవారం, 21 జులై 2023 (19:28 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ విశ్వనాథ ఆలయం చెంతనే ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వారణాసి కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ మసీదు ప్రాంగణమంతా (వాజూ ఖానా మినహా) భారత పురావస్తు పరిశోధనా సంస్థ ద్వారా సర్వే చేసేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు హిందూ ప్రతినిధుల తరపున వాదలు వినిపిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ వెల్లడించారు.
 
జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కొందరు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు వారణాసి కోర్టు.. ఆ ప్రార్థనా స్థలంలో గతంలో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశించింది. సర్వే కొనసాగుతుండగా అక్కడ శివలింగం కనిపించిందంటూ హిందూ పక్షం వేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు.. ఆ ప్రదేశాన్ని సీల్‌ చేయాలని, సీఆర్పీఎఫ్‌ భద్రతలో ఉంచాలని ఉత్తర్వులిచ్చింది.
 
ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా.. మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని ఆదేశాలిచ్చింది. అయితే, ఈ కేసు సున్నితత్వం దృష్ట్యా  సీనియర్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఆదేశిస్తూ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ అంశంపై వారణాసి కోర్టులో విచారణ జరుగుతుండగా.. హిందూ భక్తులు మరో పిటిషన్‌ దాఖలు చేశారు.
 
ఈ మసీదు ప్రాంగణమంతా ఏఎస్‌ఐతో సర్వే చేయించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఇటువంటి సర్వే వల్ల మసీదు ప్రాంగణం ధ్వంసమయ్యే అవకాశం ఉందని ముస్లింల ప్రతినిధులు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న వారణాసి కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీజ్‌ చేసిన ప్రాంతం మినహా మిగతా మసీదు ప్రాంగణమంతా శాస్త్రీయ సర్వే చేసేందుకు అంగీకరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు