శరీర రంగుతో ప్రజలను అవమానిస్తే సహించం : ప్రధాని మోడీ వార్నింగ్

ఠాగూర్

బుధవారం, 8 మే 2024 (16:59 IST)
దేశ ప్రజలను శరీర రంగుతో అవమానిస్తే సహించబోనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈశాన్య రాష్ట్ర ప్రజలను చైనీయులతో దక్షిణాదివారిని ఆఫ్రికన్లతో, ఉత్తరాది వారిని శ్వేత జాతీయులతో పోల్చారు. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రధాని మోడీ సైతం స్పందించారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన 'జాతి వివక్ష వ్యాఖ్యలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. శరీర రంగు చూపి ప్రజలను అవమానిస్తారా? అని మండిపడ్డారు.
 
'కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగానికి ఎలాంటి రక్షణ లేదు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టంగా ఉన్నా కర్ణాటకలో బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు ఇచ్చారు. ఎస్సీల విషయంలో ఆ పార్టీ వెనకడుగు వేసింది. దీనిపై నేనిచ్చిన వాగ్దానం నెరవేరుస్తా. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశాం. అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక దళిత వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేశాం. 
 
రెండోసారి వచ్చాక అదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. ఆ ఆదివాసీ బిడ్డను హస్తం పార్టీ వ్యతిరేకించింది. ఆమెను ఓడించాలని యత్నించింది. దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలని ఆ పార్టీ చూస్తోంది? చాలా మంది ప్రజల శరీరరంగు నలుపు ఉంటుంది. దాని ఆధారంగా ఆ వ్యక్తి యోగ్యతను నిర్ణయిస్తారా? శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలి' అని మోడీ వ్యాఖ్యానించారు. 
 
దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన వేళ ప్రధాని ఈ విధంగా స్పందించారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని.. శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తానెప్పటికీ సహించబోనని ప్రధాని హెచ్చరించారు. 
 
'కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందో భూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి. ఆ పార్టీ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయి. ఇండియా కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను తీసుకువస్తామని చెబుతోంది. ప్రతి పార్టీకి ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా? రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మోసగించింది. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతోంది. అందులో ఒక భాగం హైదరాబాద్.. మరో భాగం ఢిల్లీకి వెళుతుందని ఆరోపించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు