చోరీ నుంచి తప్పించుకునేందుకు దుస్తులు విప్పేసి నగ్నంగా రోడ్డుపై కూర్చున్న మహిళలు.. ఎక్కడ?

వరుణ్

సోమవారం, 29 జనవరి 2024 (15:37 IST)
ఓ దుకాణంలో చోరీ చేసిన మహిళలు... తమను పట్టుకునేందుకు వస్తున్న వారి చేతికి చిక్కకుండా ఉండేందుకు దుస్తులు విప్పేసి నగ్నంగా నడి రోడ్డుపై కూర్చొండిపోయారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కరేలీబాగ్ సమీపంలోని అంబాలాల్ పార్క్‌‍లో ఇక్బాల్ ధోబీ లాండ్రీ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నలుగురు మహిళలు షాపులోకి వచ్చి ఇక్బాల్‌ను మాటల్లో పెట్టి గల్లాపెట్టె నుంచి రూ.25 వేలు చోరీ చేసి పరారయ్యారు. ఆ తర్వాత చోరీని గుర్తించిన ఇక్బాల్ మరికొందరితో కలిసి మహిళలను వెంబడించారు.
 
తమను వెంబడిస్తున్న విషయాన్ని గుర్తించిన మహిళలు వారికి దొరక్కుండా ఉండేందుకు నడిరోడ్డుపై దుస్తులు విప్పి కూర్చుండిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అర్థనగ్నంగా రోడ్డుపై కూర్చున్న మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 
మహిళలు మాత్రం తమను వెంబడించిన వారే దాడిచేసి దుస్తులు విప్పించి కూర్చోబెట్టారని ఆరోపిస్తున్నారు. అయితే, పట్టుబడకుండా మహిళలు తమంత తామే దుస్తులు విప్పి కూర్చున్నారా? లేదంటే, నిజంగా వారిని వెంబడించిన వారే దుస్తులు విప్పించారా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
 
నిందితులైన మహిళల నుంచి రూ.9 వేలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారు తప్పించుకుని పరిగెత్తే క్రమంలో మిగతా సొమ్ము రోడ్డుపై ఉద్దేశపూర్వకంగా పడేసినట్టు పేర్కొన్నారు. వారు తమ పేర్లు, ఇతర వివరాలను వెల్లడించకపోవడంతో కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు