పోస్టులో మంగళసూత్రం - లాక్డౌన్ వేళ ఒక్కటైన జంట (video)

బుధవారం, 27 మే 2020 (10:59 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశంలో లాక్డౌన్ అమల్లోవుంది. ఈ లాక్డౌన్‌తో ముందుగా కుదుర్చుకున్న వివాహాలన్నీ ఆగిపోయాయి. కొందరు మాత్రం ముందుగా పెట్టుకున్న పెళ్లిళ్లు వాయిదా వేసుకోవడం లేదు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో వివాహతంతు పూర్తి చేస్తున్నారు. కొందరు వీడియో కాల్ ద్వారా, మరికొందరు జూమ్ యాప్ ద్వారా.. ఇంకొందరు ఇంకో విధంగా ఇలా పలు రకాలుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ జంట... పోస్టల్ శాఖ సహకారంతో పెళ్లి చేసుకోగా, వారి బంధువులు మాత్రం జూమ్ యాప్‌లో ఆశీర్వదించారు. మిగిలిన తంతును ఆ వధూవరులిద్దరే పూర్తి చేసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళకు చెందిన విఘ్నేష్, అంజలి అనే యువతీ యువకులు పూణెలో పని చేస్తున్నారు. వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు గత యేడాదే అంటే లాక్డౌన్ ముందుగానే నిర్ణయించారు.

అయితే, ముహూర్త సమయానికి తమతమ స్వంతూర్లకు వెళ్లాలని వీరు ప్లాన్ చేసుకున్నారు. తీరా ఆ సమయానికి లాక్డౌన్ అమలులోకి వచ్చింది. దీంతో వీరు పూణెలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ, వీరిద్దరూ నిరాశ చెందలేదు. పెళ్లిని వాయిదా వేసేందుకు అంగీకరించకుండా, ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి చేసుకోవాలని భావించారు.
 
పూణెలో వధూవరులు మాత్రమే ఉండగా, వారి బంధువులు ఎవరూ అక్కడకు వెళ్లే వీలులేకపోయింది. పూణెలోని స్నేహితులు వివాహ ఏర్పాట్లు చేయగా, వీరిద్దరి తల్లిదండ్రులూ, కేరళ నుంచి మంగళసూత్రాన్ని పోస్టులో పంపించారు. సమయానికి ఇండియన్ పోస్టల్ శాఖ తాళిబొట్టును స్పీడ్ పోస్టులో అందించింది. ఇక, వారి వివాహాన్ని జూమ్ యాప్ లో బంధువులంతా తిలకించి, ఆశీర్వదించారు. అలా, పోస్టల్ శాఖ సహకారం ఈ దంపతులు ఒక్కటయ్యారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు