బ్రిటీష్ కాలం నియమాలకు స్వస్తి...

మంగళవారం, 20 ఆగస్టు 2019 (19:48 IST)
మధ్యప్రదేశ్‌లోని జైళ్లలో ఉన్న ఖైదీలకు సంబంధించి బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతూ వస్తున్ననియమాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పనుంది. ప్రభుత్వం ఇందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సెప్టెంబరు మొదటివారంలో తన నివేదికను సమర్పించనుంది. ఖైదీల డ్రెస్సులను మార్చడంతో పాటు వారు పడుకునే మంచాల సైజులను పెంచనున్నారు. కేవలం మధ్యప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో బ్రిటీష్ కాలం నాటి విధానాలే అమలవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో 1968లో జైల్ మాన్యువల్ రూపొందించారు. ఖైదీల దుస్తులు, వారి మంచాల విషయంలో ఐదు దశాబ్దాల తరువాత మార్పులు చోటుచేసుకోనున్నాయి. 
 
ప్రస్తుతం ఉన్న జైల్ మాన్యువల్ ప్రకారం ఖైదీకి ఏడాదికి రెండు జతల దుస్తులు ఇస్తున్నారు. పదేళ్లకు మించి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు నల్లరంగు కుర్తా ఇస్తుంటారు. అదేవిధంగా ఒక్కో ఖైదీ నిద్రించేందుకు రెండడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవుగల మంచం, రెండు దుప్పట్లు, మూడు కంబళ్లు ఇస్తారు. చలినుంచి రక్షణకు ఒక హాఫ్ జాకెట్ ఇస్తుంటారు. వారు ఆహారం తినేందుకు ఒక ప్లేటు, గ్లాసు, చెమ్చా ఇస్తారు.

మధ్యప్రదేశ్ జైళ్ల అధికారి సంజయ్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకూ ఖైదీలు కుర్తా, పైజమా, తలకు టోపీ పెట్టుకుని కనిపిస్తున్నారని, అయితే ఇవి వారికి చాలా లూజుగా ఉంటున్నాయన్నారు. అయితే కొత్తగా రూపొందించబోయే దుస్తుల రంగులలోనూ, క్వాలిటీలోనూ మార్పులు తీసుకురానున్నారు. ఇంతేకాకుండా ఖైదీలు పడుకునే మంచం సైజును కూడా పెంచనున్నారని తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు