కరోనా ప్రాబల్య ప్రాంతాల్లో లాక్‌డౌన్ పొడగింపు?

శనివారం, 4 ఏప్రియల్ 2020 (14:20 IST)
కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ పొడగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా మరింత బలం చేకూర్చుతున్నాయి. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేడు. ముఖ్యంగా, ఈ నెల ఒకటో తేదీ నుంచి నమోదయ్యే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఈ నెల 14వ తేదీతో ముగియనున్న లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడగించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
దీనిపై మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి రాజేష్ తోపే స్పందిస్తూ, దేశవ్యాప్తంగా విధించిన కరోనా లాక్‌డౌన్ ఏప్రిల్ 14వతేదీన ముగియనున్న నేపథ్యంలో కరోనా అధికంగా ప్రబలుతున్న నగరాల్లో లాక్‌డౌన్‌ను పొడిగిస్తామని తెలిపారు. అయితే, ఈ పొడగింపు అనేది తమ రాష్ట్రానికే పరిమితమవుతుందని తెలిపారు. 
 
కాగా, మహారాష్ట్రలో ఒక్కరోజే 67 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతోపాటు ఒక్క ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒక్కరోజే 53 కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో కరోనా వల్ల ఆరుగురు మరణించగా, వీరిలో ముంబై నగరానికి చెందిన వారే నలుగురున్నారు. ధారావీకి  మురికివాడకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా ప్రాబల్య నగరాల్లో లాక్‌డౌన్ గడవును పొడిగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి రాజేష్ తోపే చెప్పారు. కరోనా కేసులు ప్రబలిన నగరాలైన ముంబైతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశముందని మంత్రి రాజేష్ వివరించారు. మహారాష్ట్రలో 490 కేసులు బయటపడగా, ఇందులో 278 ముంబై నగరంలోనివే కావడం గమనార్హం. ఈ కేసుల్లో సింహభాగానికి మూలం ఢిల్లీ మర్కజ్‌ సమ్మేళనంతో లింకువున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు