రామ మందిర భూమిపూజ తొలి పత్రిక అందుకున్న ముస్లిం నేత

సోమవారం, 3 ఆగస్టు 2020 (16:14 IST)
ఈ నెల ఐదో తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజా కార్యక్రమం కన్నులపండుగగా జరుగనుంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 
 
ఇందులోభాగంగా, రామ మందిరం భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానపత్రికల పంపిణీ ఎంపిక చేసిన అతిథులకు అందజేస్తున్నారు. తొలి ఆహ్వానపత్రిక ఒక ముస్లింకు ఇచ్చారు. భూమిపూజకు తప్పకుండా హాజరుకావాలని ఇక్బాల్ అన్సారీకి ఆ పత్రికను అందించారు. రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలమైన వాదన వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. 
 
మరోవైపు తనకు తొలి ఆహ్వాన పత్రికను ఇవ్వడంపై అన్సారీ సంతోషం వ్యక్తం చేశారు. తనకు తొలి ఆహ్వానం అందాలన్నది శ్రీరాముడి ఆకాంక్షగా తాను భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఆహ్వానపత్రాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానని తెలిపారు. అయోధ్యలో హిందువులు, ముస్లింలు శాంతిసామరస్యంతో కలిసిమెలిసి జీవిస్తున్నారన్నారు. 
 
రామ మందిర నిర్మాణంతో అయోధ్య పూర్తిగా మారిపోతుందని అన్సారీ అన్నారు. అయోధ్య మరింత అందంగా మారుతుందన్నారు. రాముడి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు వస్తారని... దీంతో, స్థానికంగా ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. 
 
మతపరమైన ఎలాంటి కార్యాక్రమానికి తనను పిలిచినా తాను వెళ్తానని గతంలోనే చెప్పానని తెలిపారు. అయోధ్యలో ప్రతి మతానికి దేవుళ్లు, దేవతలు ఉన్నారని చెప్పారు. అయోధ్య అనేది పవిత్రమైన వ్యక్తుల నేల అని... ఇక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తుండటం సంతోషకరమని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు