ప్రభుత్వ - ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య చికిత్స ధరల్లో ఎందుకు వ్యత్యాసం ఉంది? సుప్రీంకోర్టు ప్రశ్న

వరుణ్

గురువారం, 29 ఫిబ్రవరి 2024 (11:33 IST)
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సల కోసం వసూలు చేసే ధరల్లో భారీ తేడా ఉండటాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ ధరల్లో గణనీయమైన వ్యత్యాసం ఎందుకు ఉందని అపెక్స్ కోర్టు ప్రశ్నించింది. దవాఖానల్లో అందించే వైద్యసేవల ధరల్లో ప్రామాణికత పాటించాలని, లేదంటే సీజీహెచ్ఎస్ రేట్లను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రజాజీవితంలో పారదర్శకత కోసం వెటరన్స్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. 
 
ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (కేంద్ర ప్రభుత్వం) రూల్స్, 2012లోని 9వ నిబంధన ప్రకారం వైద్య చికిత్స ధరలను నియంత్రించాలని పిటిషన్‌లో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన సేవల చార్జీలను అన్ని దవాఖానాల్లో స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్ కూడా ప్రదర్శించాలన్న నిబంధన ఎప్పటి నుంచో ఉంది. దీన్ని అమలులో కేంద్రం వైఫల్యాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, కేంద్రం నిర్ణయించిన మేరకు ప్రతి చికిత్స ధర ఉండాలని స్పష్టంచేసింది. 
 
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరుతూ ఎన్నో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. దీనిపై స్పందించిన సుప్రీం పౌరుల ప్రాథమిక హక్కు అయిన 'అందరికీ అందుబాటు ధరలో వైద్యాన్ని' అందించటం కేంద్రం బాధ్యత అని తేల్చిచెప్పింది. నెలలోపు ప్రామాణికమైన ధరలను నిర్ణయించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శిని కోరింది. ఒక వేళ ఈ విషయంలో కేంద్రం విఫలమైతే సీజీహెచ్ఎస్ సూచించిన ధరలనే అమలు చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు