కరోనా భయం గుప్పెట్లో భారత్.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు

గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:47 IST)
దేశంలో కరోనా భయం నెలకొంది. ప్రతి రోజూ లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మృతులసంఖ్య కూడా అధికంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నేరుగా రంగంలోకి దిగింది. 
 
ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ప‌లు హైకోర్టుల్లో జ‌రుగుతున్న విచార‌ణ‌ల‌ను సుమోటోగా స్వీక‌రించింది. అస‌లు ఆక్సిజ‌న్‌, ఇత‌ర కొవిడ్ సంబంధిత ఔష‌ధాలు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై జాతీయ ప్ర‌ణాళిక ఉందా అంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 
 
ప్ర‌స్తుతం నేష‌న‌ల్ ఎమ‌ర్జెర్సీలాంటి ప‌రిస్థితులు ఉన్నాయ‌ని సుప్రీం వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. కొవిడ్ సంసిద్ధ‌తోపాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.
 
గురువారం చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం దీనిపై విచార‌ణ జ‌రిపింది. ఢిల్లీ, బాంబే, సిక్కిం, క‌ల‌క‌త్తా, అల‌హాబాద్ హైకోర్టులు ప్ర‌స్తుతం కొవిడ్ సంసిద్ధ‌త‌కు సంబంధించిన అంశాల‌పై విచార‌ణ జ‌రుపుతున్నాయి. 
 
ఇవి ప్ర‌జ‌ల‌ను మ‌రింత అయోమ‌యానికి గురి చేస్తున్నాయ‌ని ఈ సంద‌ర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతానికి ఆయా కోర్టులు విచార‌ణ‌లు కొన‌సాగించుకోవ‌చ్చ‌ని చెప్పిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. కొన్ని అంశాల‌ను మాత్రం త‌మ ప‌రిధిలోకి తీసుకుంటామ‌ని చెప్పింది. ఈ మొత్తం అంశంపై త‌మ‌కు ఓ జాతీయ ప్ర‌ణాళిక కావాలి అని సీజేఐ బోబ్డే తేల్చి చెప్పారు. 
 
ఇక నాలుగు అంశాల‌పై స‌మాధానాలు అడిగింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, అత్య‌వ‌స‌ర మందుల స‌ర‌ఫ‌రా, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న తీరుతోపాటు లాక్డౌన్‌లు విధించుకునే అధికారం రాష్ట్రాల‌కు వ‌దిలేయాల‌న్న అంశాల‌పై సుప్రీంకోర్టు కేంద్రం అభిప్రాయాల‌ను కోరింది. 
 
అయితే, లాక్డౌన్‌పై నిర్ణ‌యం తీసుకునే అధికారం న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు లేద‌ని స్పష్టం చేసింది. రేప‌టి నుంచి క‌రోనా నియంత్ర‌ణపై విచార‌ణ జ‌ర‌పనున్న‌ట్లు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు