రూ.37 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం

ఆదివారం, 14 మార్చి 2021 (11:45 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో వుంది. దీంతో నగలు, నగదు అక్రమంగా తరలించకుండా ఉండేందుకు వీలుగా ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సరైన ఆధారాలు లేకుండా ధ్రువీకరణ పత్రాలు లేకుండా రూ. 37.57 కోట్ల విలువైన 234 కేజీల బంగారాన్ని రోడ్డు మార్గంలో తరలిస్తుండగా తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. 
 
సేలం - చెన్నై జాతీయ రహదారిపై నిన్న ఉదయం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ బంగారం పట్టుబడినట్టు పోలీసు అధికారులు తెలిపారు. తమిళనాడులో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడడం ప్రాధాన్యం సంతరించుకుంది.  
 
ఆభరణాల రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బంగారాన్ని తరలిస్తున్న మినీ లారీ డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగలను గంగవల్లి ట్రెజరీకి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు