మహారాష్ట్ర సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్

ఆదివారం, 3 మే 2020 (09:37 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సీఎంతో పాటు మిగిలిన సెక్యూరిటీ సిబ్బంది, సీఎం వెంట ఉండే అధికారగణం ఆందోళన చెందుతోంది. 
 
సీఎం ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోనే ఆయన భద్రతా సిబ్బంది కూడా ఉంటుంది. వీరిలో ముగ్గురికి కరోనా వైరస్ సోకడం ఇపుడు కలకలం రేపుతోంది. ఈ సెక్యూరిటీ సిబ్బంది అంతా ముంబై పోలీసు శాఖ స్థానిక ఆయుధ విభాగానికి చెందినవారు. 
 
ఈ పరిస్థితుల్లో సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురు కరోనా బారిన పడటంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. జరిగిన ఘటనతో ఇప్పుడున్న భద్రతా  సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందిని నియమించనున్నామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 
 
మరోవైపు, దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 25 శాతానికి పైగా నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కేంద్రం కూడా ఆందోళన చెందుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు