ఊపిరి పీల్చుకున్న ఉద్ధవ్ ఠాక్రే - ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం

సోమవారం, 18 మే 2020 (17:41 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో పదవీ గండం నుంచి తప్పించుకున్నారు. అదేసమయంలో ఆయన సోమవారం శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
మహారాష్ట్ర శాసనమండలికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. మొత్తం 9 స్థానాలకు గాను తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో  ఉద్ధవ్ ఠాక్రేతో సహా తొమ్మిది మంది నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ప్రమాణ స్వీకారం చేసినవారిలో సీఎంతో పాటు శివసేన పార్టీ నేత నీలం గోర్హీ, బీజేపీ నేతలు గోపిచంద్ పడాల్కర్, ప్రవీణ్ దాట్కే, రంజిత్ సిన్హా మొహిత్  పాటిల్, రమేష్ కరద్‌లు ఉన్నారు. 
 
కాగా, ఇప్పటి వరకు ఉభయ సభల్లో సభ్యుడు కాని ఉద్ధవ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే పదవిని వదులుకోవాల్సి వచ్చేది. అయితే, ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పదవీ గండం నుంచి ఆయన గట్టెక్కారు. 
 
ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. మహాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. దీంతో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు