విందులో మందు తాగి ఆస్పత్రిపాలైన బెంగాల్ మహిళా ఎంపీ

సోమవారం, 18 నవంబరు 2019 (11:58 IST)
తన భర్త పుట్టినరోజు వేడుకల్లో అధిక మొత్తంలో మందులు తీసుకోవడం వల్ల నటి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యురాలు నుస్రత్ జహాన్ ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఆమె హాజకువాల్సి వుంది. 
 
అయితే, శుక్రవారం తన భర్త అయిన నిఖిల్ జైన్ జన్మదినం సందర్భంగా జరిగిన విందులో ఎంపీ నుస్రత్ తన స్నేహితులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అధిక మోతాదులో మందు తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఆమె అనారోగ్యానికి గురవడంతో ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించామని ఎంపీ నుస్రత్ అధికార ప్రతినిధి చెప్పారు. 
 
ఆస్తమా సమస్యతో బాధపడుతున్న ఎంపీ నుస్రత్ శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరారని అధికార ప్రతినిధి మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెంగాల్ నటి అయిన నుస్రత్ జహాన్ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బసీరహత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థిని సయంతన్ బసును ఓడించారు. భారీ మెజార్టీతో ఎంపీగా ఎన్నికైన నుస్రత్ ప్రముఖ వ్యాపారి అయిన తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్ జైన్ ను వివాహమాడారు. 
 
ముస్లిమ్ అయిన నుస్రత్ నుదుట సింధూరం పెట్టుకొని హిందూ సంప్రదాయ పద్ధతిలో మంగళసూత్రం కట్టించుకొని పెళ్లి చేసుకోవడం, దుర్గాపూజలో పాల్గొనడంపై దేవ్ బంద్ లోని దారుల్ ఉలూం ఆమెపై చర్యలు తీసుకోవాలని గతంలో ఆదేశించింది. ముస్లిమ్ పేరును మార్చుకోవాలని దేవ్ బంద్ కోరింది. ఎంపీ నుస్రత్ జహాన్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు