పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి కోమటిరెడ్డి

వరుణ్

మంగళవారం, 23 జనవరి 2024 (09:58 IST)
వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి భారత రాష్ట్ర సమితికి చెందిన 39 మంది ఎమ్మెల్లో 30 మంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇపుడు భారత రాష్ట్ర సమితి పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో లోక్‌సభ ఎన్నికల తర్వాత దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారని చెప్పారు. 
 
భారాస పార్టీలో ఒకవైపు, బావాబామ్మర్ధులు కొట్టుకుంటున్నారని, మరోవైపు, తండ్రికొడుకులు, ఇంకోవైపు, సంతోష్ రెడ్డి - కేటీఆర్ ఇలా ఎవరికివారు కొట్టుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలుచుకునే అవకాశం కూడా లేదని ఆయన జోస్యం చెప్పారు. పైపెచ్చు.. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఖాళీ కాబోతుందన్నారు. 
 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదనీ, తమ పార్టీ ప్రభుత్వాన్ని మేమెందుకు కూల్చుకుంటామని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల సారథ్యంలో ముందుకు వెళుతూ రాష్ట్ర ప్రజానీకానికి సుస్థిర పాలన అందిస్తామని ఆయన చెప్పారు. 
 
ఇకపోతే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తనపై అవాకులు చెవాకులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ఆయనకు సపర్యలు చేసుకోవాలని సలహా ఇచ్చారు. అక్రమ మద్యం వ్యాపారం చేసుకుంటూ వచ్చిన జగదీశ్... గత పదేళ్ల కాలంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాధనాన్ని లూఠీ చేసిన వారంతా జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు