రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఆ కార్డు ఉన్నవారికి మాత్రమే...

ఆదివారం, 24 డిశెంబరు 2023 (09:43 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందుకోసం ఆరు ఎన్నికల హామీలను గ్యారెంటీ కార్డుతో ఇచ్చింది. దీంతో ప్రజలు ఆ పార్టీకి పట్టంకట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్ర స్థానికత్వం కలిగిన మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. అలాగే, రాజీవ్ ఆరోగ్య శ్రీ ఖర్చు పరిమితిని రూ.25 లక్షలకు పెంచేశారు. ఇపుడు మరో ప్రధాన హామీని నెరవేర్చే అంశంపై దృష్టిసారించింది. అదే, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించడం. 
 
గ్యాస్ సిలిండర్ పంపిణీకి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియపై విధివిధానాలను పరిశీలిస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పౌరసరఫరాల శాఖ కీలక ప్రాతిపదనలు పంపించినట్టు సమాచారం. పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా లబ్దిదారుల బయోమెట్రిక్‌ను తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సారధ్యంలో కలెక్టర్లతో ఆదివారం నిర్వహించనున్న సమీక్షలో ఈ అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి.
 
ఇక రాష్ట్రంలో కొత్తగా గ్యాస్ కనెక్షన్లు తీసుకునేవారిని పరిగణనలోకి తీసుకోకూడదని, కొత్త రేషన్ పొందే వారిని గ్యాస్ పథకానికి ఎంపిక చేయవచ్చని పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు రాయితీ సిలిండర్లను ఏడాదికి ఆరు ఇవ్వాలా? లేక పన్నెండు ఇవ్వాలా? అనే విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 
 
ఇందుకోసం ఏయే అంశాలను ప్రాదిపదికగా తీసుకోవాలా అనే విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా ఎన్నికల హామీలను వీలైనంత త్వరగా అమలే చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించింది. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుదారుల సంఖ్య 89.98 లక్షలుగా ఉంది. ఇక గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1.20 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో డేటాబేస్తో మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలుగా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు