రంజాన్ ఉపవాస దీక్ష ప్రారంభం.. ఉచిత హలీమ్ ఆఫర్... హోటల్ వద్ద ఉద్రిక్తత

ఠాగూర్

బుధవారం, 13 మార్చి 2024 (10:49 IST)
పవిత్ర రంజాన్ మాసం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షను అవలంభిస్తారు. ఈ దీక్ష ప్రారంభ రోజును పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్ ఉచిత హలీం ఆఫర్‌ను ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు హోటల్‌కు పోటెత్తారు. ఇది ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్ ప్రాంతంలోని అజిబో ముఖారీ మండీ హోటల్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రంజాన్ మాసం తొలి రోజున గంట పాటు ఉచిత హలీమ్ ఇస్తామంటూ హోటల్ యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ సాయంత్రం కస్టమర్లు హోటల్‌కు ఒక్కసారిగా భారీగా పోటెత్తారు. వారిని నియంత్రించడం హోటల్ నిర్వాహకులకు సాధ్యపడలేదు. దీంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. రద్దీ భారీగా ఉండటంతో జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు బాటన్ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో, స్థానికంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. 
 
కాగా, ఉచిత ఆఫర్కు సంబంధించి హోటల్ యాజమాన్యం తమ నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. న్యూసెన్స్ సృష్టించడం, ట్రాఫిక్ జాంకు కారణమైనందుకు హోటల్ నిర్వాహకులపై మలక్‌‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు