మీరు ముందు చెల్లించండి.. తర్వాత మేం రూ.500 సబ్సీడీ ఖాతాలో జమ చేస్తాం

వరుణ్

సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (16:44 IST)
తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారినీ మహాలక్ష్మి పథకం కిందకు తీసుకునిరానున్నారు. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. 
 
ఆ తర్వాత రూ.500కు అదనంగా చెల్లించిన ధరను నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా రీయింబర్స్ చేసేందుకు రెడీ అవుతుంది. అందులో కేంద్రం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.40 రాయితీని పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో సిలిండర్ ధర రూ.955 ఉంటే వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్రం రాయితీ రూ.40పోనూ మిగతా రూ.415ను రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని సమాచారం.
 
'ఉజ్వల' రాయితీ పోనూ మిగతా మొత్తం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక్కో చోట ఒక్కో ధర ఉంది. రవాణా ఛార్జీల వ్యత్యాసమే అందుకు కారణం. రాష్ట్రంలో 11 లక్షల 58 వేల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వారికి కేంద్రం నుంచి సిలిండర్‌కు రూ.340 రాయితీ వస్తోంది. మహాలక్ష్మిలో ఎంపికైన గ్యాస్ వినియోగదారులు సిలిండరుపై చెల్లించే ధరలో కేంద్ర రాయితీ పోనూ మిగతా మొత్తం రూ.500 కంటే ఎంత అధికంగా ఉంటే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు సమాచారం. సిలిండర్ ధర రూ.970 ఉందనుకుంటే వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.340 పోగా, మిగతా 130ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా జమ చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు