బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్ట్‌మార్టం నివేదికలో ఏముందంటే...

వరుణ్

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (16:22 IST)
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నగరంలోని సుల్తాన్ పూర్ వద్ద ఔటర్ రింగు రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఆమె వ్యక్తిగత సహాయకుడు మాత్రం గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె శరీరం నుజ్జు నుజ్జయిపోయిందని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. 
 
దీనికి కారణం ఆమె సీటు బెల్టు పెట్టుకోకపోవడం ప్రాణాంతకంగా పరిణమించిందని తెలిపారు. ఎమ్మెల్యే నందిత ఘటనా స్థలిలోనే చనిపోవడానికి తలకు బలమైన దెబ్బలు తగలడంతో ఆమె ప్రాణాలు విడిచినట్టు పేర్కొన్నారు. ఒక కాలు విరిగిపోయిందని, శరీరంలోని ఎముకలు విరిగిపోయాయని, ముఖ్యంగా, తొడ ఎముక, పక్కటెముకలు విరిగిపోయాయని తెలిపారు. ప్రమాదం ధాటికి ఆరు దంతాలు కూడా ఊడిపోయాయని వైద్యులు తమ పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. 
 
ఔటర్ రింగు రోడ్డులో కారు ప్రమాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
 
హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్లు మృత్యురహదారిగా మారిపోయింది. ఈ రహదారిలో ఏదేని ప్రమాదం జరిగితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటం లేదు. తాజాగా ఓఆర్ఆర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎమ్మెల్యే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆమె పేరు లాస్య నందిత. సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే. 
 
ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రహదారిపై ప్రమాదానికి గురైంది. పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఎక్స్‌ఎల్ 6 రకం కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె వ్యక్తిగత సహాయకుడు ఆకాశ్ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

ఇదిలావుంటే, లాస్య నందిత భౌతికకాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అర్పించారు. హైదరాబాద్ కార్ఖానాలోని నందిత నివాసానికి వెళ్లిన కేసీఆర్... ఆమె భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం నందిత తల్లి, మాజీ ఎమ్మెల్యే సాయన్న భార్య, ఇతర కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

అంతకుముందు ట్విట్టర్ వేదికగా కేసీఆర్ స్పందిస్తూ... రోడ్డు ప్రమాదంలో నందిత మరణించడం ఎంతో బాధాకరమని చెప్పారు. పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య ప్రజల మన్ననలు పొందారని అన్నారు. కష్టకాలంలో వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కాగా, లాస్య నందిత అంత్యక్రియలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి