ఖమ్మం బరిలో సోనియా గాంధీ... పోటీపై క్లారిటీ!!

ఠాగూర్

శుక్రవారం, 5 జనవరి 2024 (07:34 IST)
త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం నుంచి బరిలోకి దిగనున్నారు. తెలంగాణాలోని 19 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఆమె ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. ఈ మేరకు ఆమె స్పష్టతనిచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది. 
 
తెలంగాణ నుంచి సోనియా లోక్‌సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి, అధిష్ఠానానికి పంపగా, ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్దత కొనసాగింది. తాజాగా ఈ విషయంలోనూ స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందు సెప్టెంబరు 17న తుక్కుగూడలో విజయభేరి పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొన్నారు. 
 
సోనియా హాజరైన తుక్కుగూడ సభ తర్వాతే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు బలంగా తీసుకువెళ్లగలిగారు. ఈ నేపథ్యంలోనే సోనియా బ్రాండ్‌ను లోక్‌సభ ఎన్నికల్లోనూ గట్టిగా ఉపయోగించాలన్న చర్చ రాష్ట్ర పార్టీలో వచ్చింది. అందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే సోనియా రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి అధిష్ఠానానికి పంపారు. 
 
తాజాగా బుధవారం జరిగిన టీపీసీసీ సమావేశంలోనూ ఈ అంశంపై మరోసారి చర్చ జరిగింది. అందులో భాగంగానే సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మరోసారి తీర్మానం చేశారు. రెండోసారి తీర్మానం తర్వాత సోనియా కార్యాలయం నుంచి రాష్ట్ర నేతలకు సానుకూల సందేశం అందినట్లు తెలిసింది. రాష్ట్రం నుంచి పోటీ చేయడానికి ఆమె అంగీకరించారని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించాలని సూచించారని సమాచారం. ఢిల్లీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో సోనియా పోటీకి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర నేతలు దృష్టి సారించారు.
 
సోనియాగాంధీ పోటీ చేయడానికి రాష్ట్రంలోని పలు లోక్‌సభ స్థానాలను పరిశీలించినప్పటికీ చివరకు ఖమ్మం నుంచి రంగంలోకి దించాలనే నిర్ణయానికి వచ్చారు. ఖమ్మం ఎంపికలో పలు అంశాలు పని చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇతర నియోజక వర్గాలతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్‌ చాలాబలంగా ఉంది. నియోజవర్గ గత ఎన్నికల చరిత్రను కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. కొత్త రాష్ట్రంలో అధికారంలో పాతుకుపోయేందుకు ఉద్దేశించిన బలమైన రాజకీయ వ్యూహంలో భాగంగానే రాష్ట్ర పార్టీ నేతలు సోనియాగాంధీని ఇక్కడ రంగంలో దించాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. 
 
రాష్ట్రంలో పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్‌ సాధారణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మరింత సుస్థిరంగా ఉండాలంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలవాలి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో 12కు పైగా గెలిస్తే గత నెల రాష్ట్రంలో బొటాబొటి మెజారిటీతో అధికారానికి వచ్చిన పార్టీ మరింత దూకుడుగా పాలనను సాగించగలదు. అన్ని రకాల ఒత్తిడులు తట్టుకొని తన ఎజెండాను అమలు చేయగలదు. 
 
తమ కష్టానికి సోనియాగాంధీ లాంటి అగ్రనేతలు పోటీ చేయడం తోడైనపుడు మాత్రమే ఇలాంటి విజయాలు సాధించగలమని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఖమ్మం నుంచి సోనియా పోటీ చేయడానికి సంబంధించిన నామినేషన్‌ పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు దాఖలు చేస్తారని సమాచారం. ఎన్నికల సమయంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ఆ సభకు సోనియాగాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు